హైదరాబాద్: వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ గెలిచి జోరు మీదున్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా గురువారం జరిగే తొలి వన్డేలో పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్న శార్దూల్ ఠాకూర్.. వెస్టిండీస్తో రెండో టెస్ట్ ఆడలేదు.
ఈ మ్యాచ్ టాస్ అనంతరం బీసీసీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్న శార్దూల్ ఠాకూర్ రెండో టెస్ట్ సెలెక్షన్కు అందుబాటులో లేడని పేర్కొంది. అతని స్థానంలో బరిలోకి దిగిన ముకేష్ కుమార్ పర్వాలేదనిపించాడు. అయితే శార్దూల్ ఠాకూర్ గాయం పురోగతిపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు.

బీసీసీఐ కూడా ఎలాంటి విషయాన్ని వెల్లడించలేదు. ఈ క్రమంలోనే శార్దూల్ ఠాకూర్ తొలి వన్డే ఆడటం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక శార్దూల్ ఠాకూర్ దూరమైతే అతని స్థానంలో అక్షర్ పటేల్ ఆడే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా రూపంలో మూడో పేసర్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో అక్షర్ పటేల్ను ఆడించేందుకు టీమిండియా మేనేజ్మెంట్ మొగ్గు చూపవచ్చు.
పైగా అక్షర్ పటేల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. అంతేకాకుండా రైట్ హ్యాండర్స్తో నిండిపోయిన జట్టులో లెఫ్టాండర్గా అతను కీలకం కానున్నాడు. బౌలింగ్లోనూ వికెట్లు తీయడంతో పాటు మెరుపు ఫీల్డింగ్తో జట్టుకు కీలక ఆటగాడిగా మారనున్నాడు. మరోవైపు శార్దూల్ ఠాకూర్ పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు.
తొలి టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 7 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అతను ఒకే ఒక్క వికెట్ తీసాడు. బ్యాటింగ్ చేసే అవకాశం అతనికి దక్కలేదు. మార్చిలో ఆస్ట్రేలియాతో చివరిసారిగా వన్డే మ్యాచ్ ఆడిన శార్దూల్ ఠాకూర్.. 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసాడు.
భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్/సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్/కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్/ముఖేశ్ కుమార్.
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్(కీపర్), హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేశ్ కుమార్.