
కోల్కతా: సొంతగడ్డపై టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్ను కైవసం చేసుకున్న రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. తాజాగా టీ20 సిరీస్ను కూడా గెలుచుకుంది. శుక్రవారం వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20లో 8 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 52), రిషభ్ పంత్(28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ మూడు వికెట్లు తీయగా.. రొమారియో షెఫర్డ్, షెల్డన్ కాట్రెల్ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 178 పరుగులే చేసి ఓటమి పాలైంది. నికోలస్ పూరన్(41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 62), రోమన్ పోవెల్ (36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 68 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి పూరన్ ఔట్ చేయడంతో భారత్ విజయం లాంఛనమైంది. ఇటీవల దారుణంగా విఫలమైన భువీ.. ఈ మ్యాచ్లో ఒకప్పటి భువీని తలపించాడు. అతనితో పాటు చాహల్, రవి బిష్ణోయ్కు తలో వికెట్ దక్కింది.
నికోలస్ పూరన్, పోవెల్ మూడో వికెట్కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. దాంతో విండీస్ విజయం లాంఛనమేనని అంతా భావించారు. కానీ భువీ సూపర్ బౌలింగ్తో ఆ జట్టు విజయానికి 6 బంతుల్లో 25 పరుగులు అవసరమయ్యాయి. అయితే తొలి రెండు బంతులకు సింగిల్స్ మాత్రమే ఇచ్చిన హర్షల్ పటేల్.. ఆ తర్వాత పోవెల్ ధాటికి రెండు సిక్స్లు ఇచ్చుకున్నాడు. దాంతో ఉత్కంఠత రేగింది. అయితే చివరి రెండు బంతులను కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన హర్షల్.. రెండు సింగిల్స్ మాత్రమే ఇచ్చి భారత్కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఇక టీ20ల్లో భారత్కు ఇది 100వ విజయం. ఈ ఘనతను అందుకున్న రెండో జట్టుగా భారత్ రికార్డుకెక్కింది. పాకిస్థాన్ 118 విజయాలతో భారత్ కన్నా ముందుంది.