ఫ్లోరిడా: వెస్టిండీస్తో చివరి టీ20లో టీమిండియా బ్యాటర్లు తేలిపోయారు. రోమారియో షెఫర్డ్(4/31), అకీల్ హొస్సెన్(2/24) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులే చేసింది. సూర్యకుమార్ యాదవ్(45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 61) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 27) పర్వాలేదనిపించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. గత మ్యాచ్లో హాఫ్ సెంచరీలతో చెలరేగిన ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(5), శుభ్మన్ గిల్(9) దారుణంగా విఫలమయ్యారు. అకీల్ హోస్సెన్ తన వరుస ఓవర్లలో ఈ ఇద్దర్నీ పెవిలియన్ చేర్చాడు. తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరగ్గా.. మూడో ఓవర్లో శుభ్మన్ గిల్ వికెట్ల ముందు దొరికిపోయాడు.

ఈ పరస్థితుల్లో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ భారీ షాట్లతో ఎదురుదాడికి దిగారు. అల్జారీ జోసెఫ్ వేసిన ఆరో ఓవర్లో తిలక్ వర్మ వరుసగా 4, 6, 4, 4 బాది 19 పరుగులు పిండుకున్నాడు. దాంతో భారత్ పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. బౌండరీలతో జోరు మీదున్న తిలక్ వర్మ(27)ను రోస్టన్ చేజ్ రిటర్న్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు.
అనంతరం బ్యాటింగ్కు వచ్చిన సంజూ శాంసన్(13) మరోసారి నిరాశపరిచాడు. రోమారియా షెఫర్డ్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా పరుగుల వేగం తగ్గింది. హార్దిక్తో కలిసి సూర్య డిఫెన్స్కే పరిమితమయ్యాడు. అల్జారీ జోసెఫ్ బౌలింగ్లో సిక్స్ బాది 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోమారియా షెఫర్డ్ బౌలింగ్లో సిక్సర్ బాదిన హార్దిక్ పాండ్యా(14).. అదే జోరులో క్యాచ్ ఔటయ్యాడు.
ఆ వెంటనే సూర్యకుమార్ యాదవ్ కూడా వెనుదిరిగగా.. క్రీజులోకి వచ్చిన అర్ష్దీప్ సింగ్ భారీ సిక్సర్ బాదాడు. కానీఆ మరుసటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్(0) కూడా ఔటవ్వగా.. చివరి ఓవర్లో అక్షర్ పటేల్ 4, 6, 2 బాది 160 పరుగుల మార్క్ను ధాటించాడు. మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అక్షర్ పటేల్ ఔటవ్వగా.. ముకేష్ కుమార్ బౌండరీతో ఇన్నింగ్స్ను ముగించాడు.