న్యూఢిల్లీ: భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్లో ఘోర తప్పిదం చోటు చేసుకుంది. అధికారిక బ్రాడ్కాస్టర్ చేసిన తప్పిదం అందర్నీ విస్మయ పరుస్తోంది. ఒక వీడియోకు బదులు మరో వీడియోను చూసి డీఆర్ఎస్ నిర్ణయం ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాంకేతికంగా తప్పిదం చేసినా.. నిర్ణయంలో తేడా లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లేకుంటే అభిమానుల తీవ్ర ఆగ్రహానికి గురయ్యేవారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై అభిమానులు మండిపడుతున్నారు. నిర్ణయంలో తేడా లేదు కాబట్టి నష్టం జరగలేదని, అదే తప్పు జరిగి ఉంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..? భారత తొలి ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. సెంచరీ హీరో విరాట్ కోహ్లీతో కలిసి ఐదో వికెట్కు 159 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో 152 బంతులు ఆడిన జడేజా 61 పరుగులు చేసి సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ కీమర్ రోచ్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు.
ముందుగా అంపైర్ ఔటివ్వకపోవడంతో వెస్టిండీస్ రివ్యూ తీసుకుంది. అయితే రివ్యూలో మరో వీడియోను బ్రాడ్ కాస్టర్ ప్లే చేయగా.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకున్నట్లు తేలడంతో థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. అనంతరం తప్పును గుర్తించిన బ్రాడ్కాస్టర్.. సాంకేతికంగా తప్పు జరిగినా సరైన నిర్ణయం తీసుకున్నారని తెలిపింది.
టీ బ్రేక్ సమయంలో సరైన వీడియోను చూపించి సాంకేతిక తప్పిదానికి క్షమాపణలు కోరింది. కామెంటేటర్ డారెన్ గంగా ఈ తప్పిదంపై మాట్లాడుతూ బ్రాడ్కాస్టర్ తరఫున వివరణ ఇచ్చాడు.
'ఇది అసలైన రిప్లే. ఇందులో బ్యాట్కు ప్యాడ్కు ఎలాంటి కాంటాక్ట్ లేదు. ఇది సరైన అల్ట్రా ఎడ్జ్. చివరకు సరైన నిర్ణయమే తీసుకున్నారు. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఇందులో అంపైర్ల తప్పిదం లేదు. సాంకేతికంగా తలెత్తిన లోపం మాత్రమే.'అని డారెన్ గంగా చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై భారత జట్టు ఆటగాళ్లు, అధికారులు ఎవరూ స్పందించలేదు.
తప్పిదాలు జరగవద్దనే సాంకేతికతను వాడుతుంటే.. అందులో కూడా మిస్టేక్స్ చేస్తే ఎలా? అని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా తప్పిదాలతో మ్యాచ్ ఫలితాలు తారు మారవుతే పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు.