పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. భారీ వర్షం కారణంగా చివరి రోజు ఆట తొలి సెషన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. భారీ వర్షం కారణంగా ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. వర్షం ఆగిపోయినా.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో అంపైర్లు ముందుగా లంచ్ బ్రేక్ ప్రకటించారు.
మైదాన సిబ్బంది గ్రౌండ్ను రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం కవర్లన్నీ తీసేయగా.. వాతావరణం మామలుగా మారింది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మైదానాన్ని అంపైర్లు పలుమార్లు పరిశీలించారు. ఈ రోజు ఆట సాధ్యం కాకపోతే మ్యాచ్ డ్రాగా ముగియనుంది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించాలంటే ఇంకా 8 వికెట్లు తీయాలి.

365 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన వెస్టిండీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 76 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్వైట్(28), కిర్క్ మెక్కెంజీ(0) విఫలమవ్వగా.. తేజ్నారయణ్ చంద్రపాల్(24 బ్యాటింగ్), జెర్మైన్ బ్లాక్వుడ్(20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీసాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 438 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ(206 బంతుల్లో 11 ఫోర్లతో 121) శతక్కొట్టగా.. రోహిత్ శర్మ(80), యశస్వీ జైస్వాల్(57), రవీంద్ర జడేజా(61), రవిచంద్రన్ అశ్విన్(56) హాఫ్ సెంచరీలతో రాణించారు.
విండీస్ బౌలర్లలో జోమెల్ వార్రికన్, కీమర్ రోచ్ మూడేసి వికెట్లు తీయగా.. జాసన్ హోల్డర్ 2 వికెట్లు తీసాడు. షెన్నన్ గాబ్రియల్కు ఓ వికెట్ దక్కింది.అనంతరం వెస్టిండీస్ మహమ్మద్ సిరాజ్(5/60) ధాటికి 255 పరుగులకు కుప్పకూలింది. క్రెయిగ్ బ్రాత్వైట్(75) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సిరాజ్కు తోడుగా ముఖేశ్ కుమార్, జడేజా రెండేసి వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ ఓ వికెట్ తీసాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ ధనాధన్ బ్యాటింగ్తో 24 ఓవర్లలోనే 2 వికెట్లకు 181 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. రోహిత్ శర్మ(57), ఇషాన్ కిషన్(52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా.. యశస్వి(38), శుభ్మన్ గిల్(29) కీలక ఇన్నింగ్స్ ఆడారు.