ఐయామ్ వెరీ సారీ..
'క్రికెట్ వెస్టిండీస్(CWI)లోని అనివార్య పరిస్థితుల కారణంగా ట్రినిడాడ్ నుంచి మ్యాచ్ వేదికైన సెయింట్ కిట్స్కు ఇరు జట్ల లగేజి ఆలస్యంగా వచ్చింది. దాంతో గోల్డ్ మెడల్ కప్లో భాగంగా ఈ రోజు జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ మొదలవ్వనుంది. ఈ అసౌకర్యం పట్ల వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పశ్చాతాపం వ్యక్తం చేయడంతో పాటు అభిమానులు, స్పాన్సర్స్, బ్రాడ్కాస్ట్ పార్ట్నర్స్, స్టేక్హోల్డర్స్కు క్షమాపణలు తెలియజేస్తుంది'అని ఓ సీడబ్ల్యూఐ ప్రకటనను విడుదల చేసింది.
ఇంత అలసత్వమా..
అయితే లగేజీ ఆలస్యంగా రావడం ఏంటని నెటిజన్లు బిత్తరపోతున్నారు. ఓ అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణ పట్ల ఇంత అలసత్వమా? అని ప్రశ్నిస్తున్నారు. రెండు గంటల ఆలస్యం కారణంగా చాలా నష్టం జరుగుతోందని చెబుతున్నారు. లేట్ నైట్ మ్యాచ్ను భారత అభిమానులకు చాలా కష్టమని, ఈ నష్టాన్ని ఎవడు తీర్చుతాడంటూ మండిపడుతున్నారు. లేట్ నైట్ మ్యాచ్ చూస్తూ మా విలువైన సమయాన్ని వృథా చేస్తున్నవారికి నష్టపరిహారం ఎవరు ఇస్తారు అంటూ నిలదీస్తున్నారు.
ఇదెక్కడి గోలరా మామ..
వర్షం, బ్యాడ్లైట్తో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమవడం చూశామని, కానీ లగేజీ కారణంగా మ్యాచ్కు అంతరాయం కలగడం ఇదే తొలిసారని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఇంత నిర్లక్ష్యంగా ఉంటుంది కాబట్టే బ్రాడ్ కాస్టింగ్ హక్కుల కోసం ఏ చానెల్స్ ముందుకు రాలేదని మండిపడుతున్నారు. అసలే ఈ విండీస్ పర్యటన మ్యాచ్లను ఎవడూ చూస్తలేడంటే.. ఈ నిర్లక్ష్యం కారణంగా చూసేవారిని కూడా దూరం చేసుకుంటున్నారని సెటైర్లు పేల్చుతున్నారు. అసలు వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ఆర్గనైజింగ్ చేయడం వస్తుందా? అంటూ మండిపడుతున్నారు.
విజయమే లక్ష్యంగా..
ఐదు టీ20ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు విజయం సాధించింది. 68 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య విండీస్ను ఓడించి ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక అదే జోరులో రెండో టీ20లో విజయం సాధించేందుకు సన్నదమైంది. ఈ సిరీస్కు ముందు జరిగిన మూడు వన్డేల సిరీస్ను శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో విండీస్ గడ్డపై మరో విజయం భారత్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందనడంలో సందేహం లేదు. ఇంగ్లాండ్తో టీ20ల్లో రోహిత్తో పాటు రిషబ్ పంత్ ఇన్నింగ్స్ను ఆరంభించగా.. విండీస్తో తొలి పోరులో సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్ పాత్ర పోషించాడు. ఈ ఏడాది టీ20ల్లో టీమ్ఇండియాకు ఏడో ఓపెనర్గా బరిలో దిగిన సూర్య ధాటిగా ఆరంభించిన ఇన్నింగ్స్ను భారీ స్కోరుగా మలచలేకపోయాడు. కేఎల్ రాహుల్ గైర్హాజరీతో ఖాళీ అయిన ఓపెనర్ స్థానంలో భారత్ ప్రయోగాలు కొనసాగిస్తుందా అన్నది ఆసక్తికరం.


Click it and Unblock the Notifications
