పోర్ట్ఆఫ్ స్పెయిన్: టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్లో కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్తో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. నాలుగో రోజు ఆట తొలి సెషన్లో 3.4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన సిరాజ్ నాలుగు వికెట్లు తీసి వెస్టిండీస్ ఇన్నింగ్స్కు తెరదించాడు.
229/5 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన వెస్టిండీస్కు తొలి ఓవర్లోనే అరంగేట్ర పేసర్ ముఖేశ్ కుమార్ దిమ్మతిరిగే షాకిచ్చాడు. అలిక్ అథనజే(37)ను వికెట్ల ముందు బోల్తాకొట్టించాడు. దాంతో ఓవర్నైట్ స్కోర్కు ఒక్క పరుగు చేయకుండానే వెస్టిండీస్ కీలక వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్ వేసిన సిరాజ్.. తన ఆధిపత్యాన్ని మొదలుపెట్టాడు.

జాసన్ హోల్డర్(15)ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చిన అతను మరుసటి ఓవర్లో అల్జారీ జోసెఫ్(4)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. మూడో ఓవర్లో వికెట్ తీయలేకపోయిన సిరాజ్.. తన నాలుగో ఓవర్లో కేమర్ రోచ్(4)ను కీపర్ క్యాచ్గా.. షెన్నన్ గాబ్రియల్(0) ఎల్బీగా పెవిలియన్ చేర్చి వెస్టిండీస్ను ఆలౌట్ చేశాడు. ఈ క్రమంలో ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.
విండీస్ గడ్డపై ఐదు వికెట్ల ఘనతను అందుకున్న ఏడో భారత పేసర్గా సిరాజ్ చరిత్రకెక్కాడు. సిరాజ్ కెరీర్లోనే ఇది బెస్ట్ పెర్ఫామెన్స్(5/60) కావడం గమనార్హం. 2021లో ఆసీస్తో మెల్బోర్న్ మైదానంలో అరంగేట్రం చేసిన సిరాజ్.. ఆ మ్యాచ్లో 2/40, 3/37 సత్తా చాటాడు. గబ్బా వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో 1/77, 5/73 అసాధారణ ప్రదర్శనతో భారత్ సాధించిన చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ 4/108 నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. ఐదు వికెట్లతో సత్తా చాటిన మహమ్మద్ సిరాజ్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. సిరాజ్కు ఐదు వికెట్లకు తోడుగా.. ముఖేశ్ కుమార్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీసారు. అశ్విన్కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. బజ్బాల్ బ్యాటింగ్తో చెలరేగుతోంది. భారత ఓపెనర్లు టీ20 తరహా బ్యాటింగ్తో చెలరేగుతున్నారు. రోహిత్ శర్మ 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. యశస్వీ జైస్వాల్ ఆ దిశగా దూసుకెళ్తున్నాడు. దాంతో 11 ఓవర్లలోనే భారత్ 97 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 280 పరుగులకు చేరింది.