న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వెస్టిండీస్తో మూడో వన్డేలోనూ హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఇషాన్ కిషన్.. ద్వైపాక్షిక సిరీస్లో వరుసగా మూడు మ్యాచ్ల్లో మూడు అర్థశతకాలు నమోదు చేసిన ఆరో భారత బ్యాటర్గా రికార్డుకెక్కాడు.
వెస్టిండీస్తో తొలి వన్డేలో 52, రెండో వన్డేలో 55 పరుగులు చేసిన ఇషాన్ కిషన్.. మూడో వన్డేలో 77 పరుగులు చేశాడు. దాంతో కృష్ణమాచారి, దిలీప్ వెంగ్సర్కార్, మహమ్మద్ అజారుద్దీన్, మహేంద్ర సింగ్ ధోనీ, శ్రేయస్ అయ్యర్ల సరసన నిలిచాడు.

1982లో కృష్ణమాచారి శ్రీకాంత్ తొలిసారి శ్రీలంకతో మూడు మ్యాచ్ల ద్వైపాక్షిక సిరీస్లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధిస్తే.. దిలీప్ వెంగ్సర్కార్ శ్రీలంకపై 1985, మహమ్మద్ అజారుద్దీన్ కూడా శ్రీలంకపై 1993, మహేంద్ర సింగ్ ధోనీ ఆస్ట్రేలియాతో 2019, శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్తో 2020లో ఈ ఫీట్ సాధించారు.
తాజాగా వెస్టిండీస్తో ఇషాన్ కిషన్ ఈ ఘనతను అందుకొని ఈ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 43 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్ మూడు భారీ సిక్సర్లతో అలరించాడు. సెంచరీ దిశగా సాగిన అతను వేగంగా ఆడే క్రమంలో స్టంపౌటయ్యాడు. యాన్నిక్ కారయ్య బౌలింగ్లో స్టెప్ ఔటై ఇషాన్ కిషన్.. బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు.
దాంతో బ్యాట్ను మిస్సైన బంతి కీపర్ చేతిలో పడగా అతను ఎలాంటి తప్పిదం చేయకుండా స్టంపౌట్ చేశాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 143 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్(8) తీవ్రంగా నిరాశపరిచాడు. క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్తో కలిసి శుభ్మన్ గిల్(62 బ్యాటింగ్) ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నాడు.