న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్ ముగిసిందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా వెస్టిండీస్ పర్యటన కోసం ఎంపిక చేసిన టీ20 జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఎవరికీ అవకాశం దక్కలేదు. ఐపీఎల్లో సత్తా చాటిన యువ ఆటగాళ్లకు చోటు కల్పించిన అజిత్ అగార్కర్ సారథ్యంలోని ఆలిండియా సెలెక్షన్ కమిటీ.. సీనియర్ ఆటగాళ్లందర్నీ దూరం పెట్టింది.
తిలక్ వర్మతో పాటు యశస్వీ జైస్వాల్, ముఖేష్ కుమార్లకు అవకాశం కల్పించింది. 2022 టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టిన బీసీసీఐ.. హార్దిక్ పాండ్యా సారథ్యంలోనే యువ ఆటగాళ్లతో 2024 ప్రపంచకప్ లక్ష్యంగా టీమ్ను సిద్దం చేస్తోంది.

ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మను టీ20 కెప్టెన్గా తప్పించినట్లుగా ఎక్కడా పేర్కొనలేదు. కానీ హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా ప్రకటించి వరుసగా మూడు సిరీస్లకు అతడి సారథ్యంలోనే జట్టును ఎంపిక చేశారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు వయసు మీద పడటం... కెరీర్ చరమాంకంలో ఉండటంతో టీ20లకు దూరంగా పెట్టినట్లు అర్థమవుతోంది. అంతేకాకుండా వారి దృష్టి ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ మీదే ఉంది. కుర్రాళ్ల ఫార్మాట్ అయిన టీ20ల నుంచి 2007 సచిన్, ద్రవిడ్ లాంటి సీనియర్లు తప్పుకొన్నట్లే.. వీళ్లు కూడా ఇప్పుడు దూరం అయ్యారని భావించవచ్చు.
2024 ప్రపంచకప్ లక్ష్యంగా టీ20 జట్టులో యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేస్తున్న బీసీసీఐ.. మర్యాదపూర్వకంగానే వీరిని టీ20ల నుంచి తప్పుకోమని చెప్పి ఉండొచ్చు. కోహ్లీ, రోహిత్ కూడా పరిస్థితిని అర్థం చేసుకుని టీ20లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని ఉండొచ్చు.
కాబట్టి మళ్లీ వీరిని భారత్ తరఫున టీ20ల్లో చూడటం అనుమానమే. వీరితో పాటు ప్రపంచకప్లో ఆడిన షమీ, అశ్విన్, భువనేశ్వర్ లాంటి సీనియర్లు కూడా ఇక మళ్లీ టీ20లు ఆడే అవకాశం లేదు. అయితే వన్డే ప్రపంచకప్ గెలిస్తే కోహ్లీ, రోహిత్లకు టీ20ల్లో చోటు దక్కవచ్చు. అయితే వారి అప్పటి ఫిట్నెస్ ఫామ్పై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఐపీఎల్ 2024 సీజన్లో రాణించేదాన్ని బట్టి నిర్ణయం తీసుకోనున్నారు.