వెస్టిండీస్తో రెండో టెస్ట్లో టీమిండియా విజయం ముంగిట నిలిచింది. 121 పరుగుల లక్ష్యచేధన కోసం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. విజయానికి మరో 58 పరుగుల దూరంలో నిలిచింది. క్రీజులో కేఎల్ రాహుల్(25 బ్యాటింగ్)తో పాటు సాయి సుదర్శన్(30 బ్యాటింగ్) ఉన్నాడు. దూకుడుగా ఆడే క్రమంలో వారికన్ బౌలింగ్లో యశస్వి జైస్వాల్(8) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
అంతకుముందు 173/2 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో 390 పరుగులకు ఆలౌటైంది. జాన్ కాంప్బెల్(199 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 115), షైహోప్(214 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 103) సెంచరీలతో చెలరేగగా.. జస్టిన్ గ్రీవ్స్(85 బంతుల్లో 3 ఫోర్లతో 50 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు.

జైడెన్స్ సీల్స్(32)తో కలిసి జస్టిన్ గ్రీవ్స్ ఆఖరి వికెట్కు 79 పరుగులు జోడించాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(3/44), కుల్దీప్ యాదవ్(3/104) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/43) రెండు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్కు చెరో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 518/5 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.
వెస్టిండీస్ను ఆలౌట్ చేసేందుకు భారత బౌలర్లు చెమటోడ్చారు. ముఖ్యంగా జాన్ కాంప్బెల్, షైహోప్ జోడీని విడదీసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. తొలి ఇన్నింగ్స్లో 81.5 ఓవర్లు బౌలింగ్ చేసిన భారత బౌలర్లు తీవ్రంగా అలసి పోయారు. పిచ్ కూడా పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలంగా మారడం విండీస్కు కలిసొచ్చింది. కాంప్బెల్ కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు. సెంచరీ అనంతరం కాంప్బెల్ను జడేజా వికెట్ల ముందు బోల్తా కొట్టించడంతో వెస్టిండీస్ 252/3 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
రెండో సెషన్లో షైహోప్ 204 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతన్ని మహమ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో విండీస్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. రోస్టన్ చేజ్(40), టెవిన్ ఇమ్లాచ్(12), ఖారీ పీర్రె(0)లను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. జోమెల్ వార్రికన్(3), అండర్సన్ ఫిలిప్(2)లను బుమ్రా పెలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో జైడెన్ సీల్స్తో కలిసి జస్టిన్ గ్రీవ్స్ పోరాడాడు. దాంతో విండీస్ 361/9 స్కోర్తో టీ బ్రేక్కు వెళ్లింది. ఆఖరి సెషన్లోనూ ఈ జోడీ సాధికారికంగా ఆడింది. ముఖ్యంగా జస్టీన్ గ్రీవ్.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. జైడెన్ సీల్స్ను బుమ్రా ఔట్ చేయడంతో వెస్టిండీస్ పోరాటం ముగిసింది.