
పోర్ట్ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ గడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా రెండో వన్డేలోనూ గెలుపొందిన శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. దాంతో అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ వన్డేల్లో వరుసగా అత్యధిక ద్వైపాక్షిక సిరీస్లు గెలిచిన జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది. ఈ క్రమంలో పాకిస్థాన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. తాజా సిరీస్ విజయం విండీస్పై భారత్కు వరుసగా 12వ ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం కాగా.. జింబాబ్వేపై పాకిస్థాన్ వరుసగా 11 ద్వైపాక్షిక వన్డే సిరీస్లు గెలిచింది. ఇప్పటికే ఇదే అత్యధికంగా ఉండగా.. తాజా ఫలితంతో పాక్ను భారత్ అధిగమించింది.
ఆదివారం ఉత్కంఠగా సాగిన రెండో వన్డేలో టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 311 పరుగులు చేసింది. కెరీర్లో 100వ వన్డే ఆడిన ఓపెనర్ షై హోప్(135 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 115) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ నికోలస్ పూరన్ (77 బంతుల్లో ఫోర్, 6 సిక్సర్లతో 74) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా.. దీపక్ హుడా, చాహల్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో 8 వికెట్లకు 312 పరుగులు చేసి 2 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శిఖర్ ధావన్(13) విఫలమైనా.. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్(49 బంతుల్లో 5 ఫోర్లతో 43) ఫర్వాలేదనిపించాడు.
ఇక శ్రేయస్ అయ్యర్(71 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 63), సంజూ శాంసన్(51 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో దీపక్ హుడా సాయంతో అక్షర్ పటేల్ ధాటిగా ఆడాడు. హుడా వెనుదిరిగినా.. సిరాజ్(1 నాటౌట్) సాయంతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి.
క్రీజులో సిరాజ్ ఉండటంతో విజయం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ వరుసగా మూడు బంతులు సింగిల్ తీసిన అక్షర్.. నాలుగో బంతికి భారీ సిక్సర్తో ఇన్నింగ్స్ ముగించాడు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, కైల్ మేయర్స్ రెండేసి వికెట్లు తీయగా.. సీల్స్, రొమారియో, అకీల హోసిన్ తలో వికెట్ పడగొట్టారు.