కోల్కతా:రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వెస్టిండీస్తో ఇప్పటికే వన్డే సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టీ20 సిరీస్ను కూడా 3-0తో వైట్ వాష్ చేసింది. దాంతో వెస్టిండీస్ విజయం లేకుండానే భారత పర్యటనను ముగించింది. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఆఖరి టీ20లో సమష్టిగా చెలరేగిన టీమిండియా 17 పరుగులతో గెలుపొందింది. రోహిత్ శర్మ సూపర్ కెప్టెన్సీ భారత్ జట్టు విజయానికి కలిసొచ్చింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(31 బంతుల్లో ఫోర్, 7 సిక్స్లతో 65) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగగా.. ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్(19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 35 నాటౌట్) అండగా నిలిచాడు. ఈ ఇద్దరు ఐదో వికెట్కు 91 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్, షెఫెర్డ్, చేజ్, వాల్ష్, డ్రేక్స్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆ జట్టులో నికోలస్ పూరన్(47 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 61) వరుసగా మూడో హాఫ్ సెంచరీ బాదినా ఫలితం లేకపోయింది. అతనికి తోడుగా రోవ్మన్ పొవెల్(14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 25),రొమారియో షెఫెర్డ్(21 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 29) రాణించినా.. రోహిత్ శర్మ సూపర్ కెప్టెన్సీ ముందు నిలవలేకపోయారు. బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ సెటప్తో రోహిత్.. విండీస్ పతనాన్ని శాసించాడు.
కీలక భాగస్వామ్యాలు విడదీసేలా అప్పటికప్పుడు బౌలర్లను, ఫీల్డర్లను మార్చి ఫలితం రాబట్టాడు. చివర్లో 18 బంతుల్లో విండీస్ విజయానికి 37 రన్స్ అవసరమవ్వగా.. శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ రెండేసి వికెట్లు తీసారు.