తరౌబా: వెస్టిండీస్తో జరుగుతున్న కీలక మూడో వన్డేలోనూ టీమిండియా ప్రయోగాలకే మొగ్గు చూపింది. రెండో వన్డేకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ నుంచి కూడా విశ్రాంతి కల్పించింది. తుది జట్టులో మరో రెండు మార్పులు చేసిన టీమిండియా.. రుతురాజ్ గైక్వాడ్, జయదేవ్ ఉనాద్కత్లకు అవకాశం ఇచ్చింది.
ఈ ఇద్దరి కోసం అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్లను బెంచ్కు పరిమితం చేసింది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్కు అనుకూలంగా ఉందనే ఈ నిర్ణయం తీసుకున్నానని వెస్టిండీస్ కెప్టెన్ షై హైప్ తెలిపాడు. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్ను కొనసాగిస్తున్నామని చెప్పిన షై హోప్.. ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే నిలకడగా రాణించడం ముఖ్యమన్నాడు.

జట్టులో రెండు మార్పులు చేశామని చెప్పిన టీమిండియా తాత్కలిక సారథి హార్దిక్ పాండ్యా.. ఉమ్రాన్ మాలిక్, అక్షర్ పటేల్ స్థానాల్లో రుతురాజ్ గైక్వాడ్, జయదేవ్ ఉనాద్కత్ జట్టులోకి వచ్చారని తెలిపాడు. డిసైడర్ మ్యాచ్లో సత్తా చాటేందుకు కుర్రాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారని చెప్పాడు.
పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తుందని, ముందుగా బ్యాటింగ్ చేయడం మంచి అవకాశంగా భావిస్తున్నామని తెలిపాడు. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచుతామని చెప్పాడు. మూడు వన్డేల సిరీస్లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలవడంతో ఈ మ్యాచ్ డిసైడర్గా మారింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకే సిరీస్ దక్కనుంది.
వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ప్రయోగాలకు ఈ సిరీస్ను వాడుకుంటున్న టీమిండియా.. కోహ్లీ, రోహిత్లకు రెస్ట్ ఇచ్చి మరీ బెంచ్ బలాన్ని పరీక్షిస్తోంది.
తుది జట్లు:
భారత్: ఇషాన్ కిషన్(కీపర్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనాద్కత్, కుల్దీప్ యాదవ్, ముకేష్ కుమార్
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అథనాజ్, షైహోప్, షిమ్రాన్ హెట్మైర్, కీసీ కార్టీ, రొమారియో షెఫెర్డ్, యాన్నిక్ కారయ్య, అల్జారీ జోసెఫ్, గుడకేష్ మోతీ, జయడేన్ సీల్స్.