సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. వెస్టిండీస్తో టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా.. తాజాగా వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. వెస్టిండీస్తో మంగళవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 115 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 358 పరుగులు చేసింది. టీమిండియా యువ బ్యాటర్ హర్లీన్ డియోల్(103 బంతుల్లో 16 ఫోర్లతో 115) సెంచరీతో చెలరేగింది. వన్డే క్రికెట్లో హర్లీన్ డియోల్కు ఇదే తొలి శతకం.

హర్లీన్ డియోల్తో పాటు ప్రతిక రవల్(86 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 76), స్మృతి మంధాన(47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 53), జెమీమా రోడ్రిగ్స్(36 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో డియాండ్ర డాటిన్, జైదా జేమ్స్, అఫీ ఫ్లేచర్, కియాన జోసెఫ్ తలో వికెట్ తీసారు. వన్డేల్లో భారత్ 350కి పైగా పరుగులు చేయడం ఇది రెండోసారి. 2022లో ఐర్లాండ్పై కూడా భారత్ 358/5 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ 46.2 ఓవర్లలో 243 పరుగులకు కుప్పకూలింది. హీలీ మాథ్యూస్(109 బంతుల్లో 13 ఫోర్లతో 106) సెంచరీతో ఒంటరి పోరాటం చేసింది. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా(3/49) మూడు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ(2/40), టిటాస్ సధు(2/42) రెండేసి వికెట్లు పడగొట్టారు. రేణుకా సింగ్ ఓ వికెట్ తీసింది.
ఈ మ్యాచ్లో టీమిండియాకు స్మృతి మంధాన, ప్రతికా రవల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్కు 110 పరుగులు జోడించారు. దురదృష్టవశాత్తు స్మృతి మంధాన రనౌటవ్వగా.. హర్లీన్ డియోల్తో కలిసి ప్రతికా రావల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించింది. సెంచరీ దిశగా సాగిన ప్రతికా రావల్ను జైదా జేమ్స్ క్యాచ్ ఔట్ చేయడంతో రెండో వికెట్కు నమోదైన 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి హర్మన్ప్రీత్ కౌర్ రాగా.. హర్లీన్ డియోల్ చెలరేగింది. హర్మన్ ప్రీత్ కౌర్ ఔటైనా.. జెమీమా రోడ్రిగ్స్తో కలిసి 98 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకుంది. సెంచరీ అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో హర్లీన్ డియోల్ ఔటైనా.. జెమీమా హాఫ్ సెంచరీతో సత్తా చాటింది. చివర్లో ఔటైనా.. రిచా ఘోష్ భారీ స్కోర్ అందించింది.