తరౌబా: వెస్టిండీస్తో తొలి టీ20 సందర్భంగా టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా భావోద్వేగానికి గురయ్యాడు. జాతీయ గీతాలపన సందర్భంగా హార్దిక్ పాండ్యా ఉబికి వస్తున్న దు:ఖాన్నిఆపుకోలేకపోయాడు. ఒక్కసారిగా తన కెరీర్ ఒడిదొడుకులను గుర్తు చేసుకున్న హార్దిక్ పాండ్యా కన్నీటి పర్యంతమయ్యాడు.
ఇది టీమిండియాకు 200 అంతర్జాతీయ టీ20 మ్యాచ్. ఈ మ్యాచ్కు సారథ్యం వహించడాన్ని హార్దిక్ గర్వంగా ఫీలయ్యాడు. ఈ క్రమంలోనే కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్గా ఎదిగిన తీరును నెమరువేసుకున్నాడు. తాను సాధించిన ఈ మైలు రాయిని చూసేందుకు తన తండ్రి లేడని భావించి తల్లడిల్లాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ మ్యాచ్లో టీమిండియాకు ఓటమే ఎదురైంది. పేలవ బ్యాటింగ్తో 4 పరుగుల తేడాతో విండీస్ చేతిలో ఖంగు తిన్నది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసింది.
నికోలస్ పూరన్(41), రోవ్మన్ పోవెల్(48) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ రెండేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులే చేసి ఓటమిపాలైంది. తిలక్ వర్మ(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 39) మినహా అంతా విఫలమయ్యారు. జాసన్ హోల్డర్, రోమారియో షెఫర్డ్, ఒబెడ్ మెక్కాయ్ రెండేసి వికెట్లు తీయగా.. అకీల్ హోస్సెన్ ఓ వికెట్ పడగొట్టాడు.