
న్యూఢిల్లీ: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మూడు వన్డేల సిరీస్ ప్రేక్షకుల్లేకుండా ఖాళీ మైదానాల్లో జరగనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(జీసీఏ) మంగళవారం ప్రకటించింది. ఫిబ్రవరి 6 నుంచి 11 వరకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మూడు మ్యాచ్లు జరగనున్న విషయం తెలిసిందే.
'వెస్టిండీస్తో జరగనున్న వన్డే సిరీస్ కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఫిబ్రవరి 6న జరుగనున్న తొలి వన్డే భారత్కు చాలా ప్రత్యేకం. వన్డే ఫార్మాట్లో భారత్కు ఇది 1000వ మ్యాచ్. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే వెయ్యి అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించనుంది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే మూడు మ్యాచ్లను నిర్వహించనున్నాం'అని జీసీఏ ట్వీట్ చేసింది.
ఇరు జట్ల మధ్య కోల్కతా వేదికగా జరిగే మూడు టీ20ల సిరీస్ మాత్రం ప్రేక్షకుల మధ్యే జరగనుంది. ఈ మ్యాచ్ల నిర్వహణ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెసులబాటు కల్పించింది. స్టేడియం మొత్తం సీట్ల సామర్థ్యంలో 75 శాంతం ఆక్యుపెన్సీతో మ్యాచ్లను నిర్వహించేందుకు అనుమతిచ్చింది. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఫిబ్రవరి 16, 18, 20వ తేదీల్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మూడు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి.