న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలను తిరిగిన వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానేకు అప్పగించడంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. రహానేకు వైస్ కెప్టెన్సీ ఇచ్చి బీసీసీఐ మంచి పనిచేసిందని అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా రహానేకు అభినందనలు తెలుపుతున్నారు.
ఏడాది క్రితం పేలవ ఆటతీరుతో వైస్ కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కోల్పోయిన రహానే.. దేశవాళీ, కౌంటీ క్రికెట్తో పాటు ఐపీఎల్లో సత్తా చాటి డబ్ల్యూటీసీ ఫైనల్లో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మెగా ఫైనల్లో భారత బ్యాటర్లంతా విఫలమైన వేళ రహానే అసాధారణ బ్యాటింగ్తో టాప్ స్కోరర్గా నిలిచాడు.

ఈ పెర్ఫామెన్స్తో మళ్లీ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రహానే.. అప్కమింగ్ వెస్టిండీస్ పర్యటనలో రోహిత్ శర్మకు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. జూలై 12 నుంచి ప్రారంభమయ్యే ఈ సుదీర్ఘ పర్యటనకు వెళ్లే భారత జట్లను బీసీసీఐ శుక్రవారమే ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన టెస్ట్ టీమ్ వివరాలను ఆలిండియా సెలెక్షన్ కమిటీ వెల్లడించింది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో దారుణంగా విఫలమైన చతేశ్వర్ పుజారా, ఉమేశ్ యాదవ్లపై వేటు వేసిన సెలెక్టర్లు రుతురాజ్ గైక్వాడ్తో పాటు యశస్వీ జైస్వాల్, ముఖేశ్ కుమార్లకు అవకాశం ఇచ్చారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో వైస్ కెప్టెన్గా ఉన్న పుజారాను తప్పించడంతో రహానేకు ఆ బాధ్యతలు దక్కాయి. రహానేకు వైస్ కెప్టెన్సీ దక్కడంపై సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
వెస్టిండీస్ పర్యటనలో చెలరేగితే టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ కూడా దక్కుతుందని కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు వైస్ కెప్టెన్సీనే.. రేపో మాపో టీమిండియా సారథివి నువ్వే అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత టెస్ట్ టీమ్:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), కేఎస్ భరత్(కీపర్), ఇషాన్ కిషన్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, ముఖేశ్ కుమార్, జయదేవ్ ఉనాద్కత్, నవదీప్ సైనీ.