న్యూఢిల్లీ: వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత వన్డే, టెస్ట్ టీమ్లను బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. 16 మంది సభ్యులతో కూడిన టెస్ట్ టీమ్ వివరాలను ఎస్ఎస్ దాస్ సారథ్యంలోని ఆలిండియా సెలెక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ఊహించినట్లుగానే చతేశ్వర్ పుజారా, ఉమేశ్ యాదవ్లపై వేటు వేసిన సెలెక్టర్లు..సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి విశ్రాంతినిచ్చారు.
వీరి స్థానాల్లో ఐపీఎల్లో సత్తా చాటిన రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, ముఖేష్ కుమార్లకు అవకాశం ఇచ్చింది. అయితే ఈ సెలెక్షన్పై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు మరోసారి మొండి చెయ్యే చూపించడంపై ఫ్యాన్స్, క్రికెటర్లు మండిపడుతున్నారు. అతను చేసిన పాపం ఏంటో చెప్పాలని నిలదీస్తున్నారు.

కొంతకాలంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్కు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్లో రాణించినవారికే ప్రాధాన్యత ఇస్తారా? అని మండిపడుతున్నారు. ఐపీఎల్ ఫామ్ను పరిగణలోకి తీసుకున్న తర్వాత దేశవాళీ క్రికెట్ ఎందుకు? అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సర్ఫరాజ్ ఖాన్కు టీమిండియాలో చోటు దక్కకపోవడంపై విమర్శలు రావడం ఇదే కొత్త కాదు. గతేడాది కాలంగా టెస్ట్ క్రికెట్కు టీమిండియా ఎంపిక ఎప్పుడూ జరిగినా సర్ఫరాజ్ ఖాన్ పేరు కచ్చితంగా ట్రెండింగ్లో ఉంటుంది. దేశవాళీలో పరుగుల వరద పారిస్తున్నా.. సర్ఫరాజ్ ఖాన్ను సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు.
ఇక సర్ఫారాజ్ని కాదని ఐపీఎల్లో రాణించిన రుతురాజ్ గైక్వాడ్ , యశస్వి జైస్వాల్ను ఎంపిక చేయడం అభిమానులను మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. ఇప్పటివరకు 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన సర్ఫరాజ్.. ఏకంగా 79 సగటుతో 3,505 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీ కూడా ఉన్నాయి.
వరుసగా 2019-2020, 2020- 2021 సీజన్లలో 900కు పైగా పరుగులు సాధించిన సర్ఫరాజ్.. ఈ సీజన్లో కూడా ఇప్పటికే 600కు పైగా పరుగులు చేశాడు. ఈ మూడు సీజన్లలో సర్ఫరాజ్ సగటు ఏకంగా 100కు పైగా ఉండటం గమనార్హం. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుతంగా ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్ మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.
ఇప్పటివరకు 50 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 22 సగటుతో 585 పరుగులే చేశాడు. ఒకే ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ సీజన్లో మరీ దారుణంగా 4 మ్యాచ్ల్లో 13 సగటుతో 53 పరుగులే చేశాడు. వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్కు ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ గణాంకాలను చూస్తే సర్ఫరాజ్ ఖాన్ కన్నా తక్కువగా ఉన్నాయి.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 28 మ్యాచ్లాడిన రుతురాజ్ గైక్వాడ్ 42 సగటుతో 1,941 పరుగులే చేశాడు. ఒక్క సారి కూడా డబుల్ సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు. యశస్వి జైస్వాల్ విషయానికొస్తే 80 సగటుతో 1845 పరుగులు చేసినప్పటికీ అతనికి 15 మ్యాచ్ల అనుభవం మాత్రమే ఉంది.
ఏ రకంగా చూసిన ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ కన్నా సర్ఫరాజ్ ఖాన్ గణాంకాలే మెరుగ్గా ఉన్నాయి. కానీ రుతురాజ్, జైస్వాల్ ఐపీఎల్లో దుమ్మురేపడంతో వారికి అవకాశం దక్కింది.