
సెయింట్ కిట్స్: వెస్టిండీస్తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా కీలక మార్పుతో బరిలోకి దిగింది. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో పార్ట్టైమ్ బౌలర్ కమ్ విధ్వంసకర బ్యాటర్ దీపక్ హుడాకు అవకాశమిచ్చింది. ఈ నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడో టీ20కి అసలు సిసలు నిర్ణయం తీసుకున్నారని, హుడా రాకతో భారత జట్టు కాంబినేషన్ సెట్ అయిందని కామెంట్ చేస్తున్నారు. ఇటీవల టీ20 ఫార్మాట్లో దీపక్ హుడా దుమ్మురేపాడు. ఐర్లాండ్ పర్యటనలో సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లండ్ పర్యటనలోనూ రాణించాడు.
లెఫ్టార్మ్ పేసర్ను
దాంతోనే అతను వెస్టిండీస్ పర్యటనకు కూడా ఎంపికయ్యాడు. కానీ టీమ్లో నెలకొన్న తీవ్ర పోటీ కారణంగా తొలి రెండు మ్యాచ్ల్లో అవకాశం అందుకోలేకపోయాడు. తొలి మ్యాచ్లో గెలిచిన భారత్.. రెండో మ్యాచ్లో తేలిపోయింది. లెఫ్టార్మ్ పేసర్ ధాటికి టీమిండియా బ్యాటింగ్ దళం పెవిలియన్కు క్యూ కట్టంది. దాంతోనే మూడో టీ20లో జడేజాను కాదని హుడాను జట్టులోకి తీసుకొచ్చింది. లెఫ్టార్మ్ పేసర్ను హుడా సమర్థవంతంగా ఎదుర్కోగలడు. ఆ ఉద్దేశంతోనే టీమిండియా మేనేజ్మెంట్ అతన్ని జట్టులోకి తీసుకొచ్చింది.
ఫ్యాన్స్ ఖుషి..
ఇక దీపక్ హుడా జట్టులోకి రావడంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్ వేదికగా కెప్టెన్ రోహిత్ శర్మకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. లవ్ యూ రోహిత్.. ఇన్నాళ్లకు మంచి నిర్ణయం తీసుకున్నావ్ అంటూ కితాబిస్తున్నారు. మొత్తానికి హుడా జట్టులోకి వచ్చాడంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హుడా రాకతో జట్టులో బౌలింగ్, బ్యాటింగ్ ఆప్షన్స్ పెరుగుతాయని కామెంట్ చేస్తున్నారు. ఇది జట్టుకు ప్రయోజనం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.
భారత్ లక్ష్యం 165
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్ కైల్ మేయర్స్(50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లతో 73) ధాటిగా ఆడాడు. రోవ్మన్ పొవెల్ (14 బంతుల్లో 23) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.