డొమినికా: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరంగేట్ర టెస్ట్ మ్యాచ్లోనే సెంచరీతో చెలరేగాడు. వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్లో అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లకు సహనంగా నిలిచాడు. ఐపీఎల్ 2023 సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన యశస్వి.. అంతర్జాతీయ క్రికెట్లోనూ అదే జోరును కొనసాగిస్తూ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.
ఈ క్రమంలో పలు రికార్డులను అతను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరఫున అరంగేట్ర టెస్ట్లోనే సెంచరీ నమోదు చేసిన మూడో ఓపెనర్గా నిలిచిన యశస్వి.. 17వ బ్యాటర్గా చరిత్రకెక్కాడు. అంతేకాకుండా అరంగేట్ర మ్యాచ్లో అత్యధిక బాల్స్ ఆడిన తొలి బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో మహమ్మద్ అజారుద్దీన్ రికార్డును బ్రేక్ చేశాడు.

అతను అరంగేట్ర మ్యాచ్లో ఇంగ్లండ్పై 322 బాల్స్ ఆడగా.. జైస్వాల్ 350 బంతులతో 143 పరుగులతో క్రీజులో నిలిచి ఆ రికార్డును అధిగమించాడు. యశస్వి జైస్వాల్ బ్యాటింగ్పై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. యశస్వి అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్నాడని కొనియాడుతున్నారు. కొందరైతే టీమిండియా వాల్, నయావాల్లతో పోల్చుతున్నారు.
యశస్వీ బ్యాటింగ్.. 'ద్రవిడ్ ప్రియ శిష్యుడిలా.. పుజారా తమ్ముడిలా'ఉందని ప్రశంసిస్తున్నారు. ఇంకా క్రీజులోనే ఉన్న యశస్వి.. మాజీ కెప్టెన్ కోహ్లీతో కలిసి భారీ ఇన్నింగ్స్ దిశగా దూసుకెళ్తున్నాడు. మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే మూడో రోజు ఆటలో యశస్వి 57 రన్స్ చేస్తే.. అరంగేట్ర మ్యాచ్లోనే డబుల్ సెంచరీ చేసిన భారత ప్లేయర్గా చరిత్రకెక్కనున్నాడు.
45 పరుగులు చేస్తే అరంగేట్ర మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్గా నిలుస్తాడు. శిఖర్ ధావన్(187), రోహిత్ శర్మ(177) అరంగేట్ర మ్యాచ్లోనే అత్యధిక పరుగులు చేశారు.

ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 113 ఓవర్లలో 2 వికెట్లకు 312 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం162 పరుగులకు చేరుకుంది. యశస్వీ జైస్వాల్తో పాటు విరాట్ కోహ్లీ(36 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ(221 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 103) సెంచరీతో రాణించగా.. శుభ్మన్ గిల్(6) విఫలమయ్యాడు.
ఇక వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. రవిచంద్రన్ అశ్విన్(5/60) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, శార్దూల్ ఠాకూర్కు తలో వికెట్ దక్కింది. విండీస్ బ్యాటర్లలో అలిక్ అతనాజే(47) మినహా అంతా విఫలమయ్యారు.
పూర్తి ఏకపక్షంగా సాగుతున్న ఈ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించే అవకాశం ఉంది.