పోర్ట్ ఆఫ్ స్పెయిన్: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన మాయాజలాన్ని ప్రదర్శించాడు. స్టన్నింగ్ డెలివరీతో బ్యాటర్ దిమ్మతిరిగేలా చేశాడు. వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్లో అసాధారణ బంతితో అందర్నీ ఆకట్టుకున్నాడు. అతను వేసిన బంతి పిచ్పై నాగినీ ఆడింది.
బాల్ ఆఫ్ ద ఇయర్గా నిలిచిపోనుంది. అశ్విన్ స్నేక్ బాల్ దెబ్బకు సెంచరీ దిశగా దూసుకెళ్తున్న వెస్టిండీస్ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్(75) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ ఊహించని బంతికి అతను నోరెళ్లబెట్టాడు. మూడు రోజు ఆట రెండో సెషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అశ్విన్ వేసిన 73వ ఓవర్ నాలుగో బంతి అనూహ్యంగా టర్న్ అయ్యి బ్రాత్వైట్ మిడిల్ స్టంప్ను లేసేసింది.

ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేసిన ఈ బంతిని బ్రాత్వైట్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బంతి షార్ప్గా టర్న్ అయ్యి బ్యాట్, ప్యాడ్ మధ్యలో నుంచి దూసుకెళ్లి వికెట్లను తాకేసింది. ప్రస్తుతం ఈ వికెట్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. అశ్విన్ స్పిన్ మాంత్రికుడని కొనియాడుతున్నారు. అశ్విన్ కెరీర్లోనే ఈ వికెట్ గొప్పగా నిలిచిపోతుందని కొనియాడుతున్నారు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 108 ఓవర్లలో 5 వికెట్లకు 229 పరుగులు చేసింది. జాసన్ హోల్డర్ (11 బ్యాటింగ్), అథనేజ్ (37 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వెస్టిండీస్ ఇంకా 209 పరుగుల వెనుకంజలో ఉంది.
కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్ (75) హాఫ్ సెంచరీతో రాణించగా.. కిర్క్ మెకంజీ (32), బ్లాక్వుడ్ (20), జాషువా ద సిల్వా (10) మరోసారి విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, అశ్విన్, ముఖేశ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. మ్యాచ్కు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో 67 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 438 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ(206 బంతుల్లో 11 ఫోర్లతో 121) శతక్కొట్టగా.. రోహిత్ శర్మ(80), యశస్వీ జైస్వాల్(57), రవీంద్ర జడేజా(61), రవిచంద్రన్ అశ్విన్(56) హాఫ్ సెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో జోమెల్ వార్రికన్, కీమర్ రోచ్ మూడేసి వికెట్లు తీయగా.. జాసన్ హోల్డర్ 2 వికెట్లు తీసాడు. షెన్నన్ గాబ్రియల్కు ఓ వికెట్ దక్కింది.