పోర్ట్ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా తన జోరును కొనసాగిస్తోంది. రెండు టెస్ట్ల సిరీస్ను 1-0తో కైవసం చేసుకుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్ట్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లోనూ భారత్ విజయం సాధించేలా కనిపించినా.. వరణుడు దెబ్బతీసాడు.
భారీ వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో అంపైర్లు చివరి రోజు ఆటను రద్దు చేసి డ్రాగా ప్రకటించారు. రెండో టెస్ట్లో సంచలన బౌలింగ్ ప్రదర్శనతో వెస్టిండీస్ను ఆలౌట్ చేసిన మహమ్మద్ సిరాజ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. వరుసగా నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసిన సిరాజ్(5/60).. కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ నమోదు చేశాడు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కింద సిరాజ్కు 500 అమెరికా డాలర్లు క్యాష్ ప్రైజ్గా దక్కాయి. భారత కరెన్సీలో దీని విలువ రూ.41 వేలు మాత్రమే. క్రికెట్ ప్రపంచంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఇంత తక్కువ క్యాష్ ప్రైజ్ ఎక్కడా లేదు. భారత్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు కనీసం లక్ష రూపాయలు ప్రైజ్మనీగా ఇస్తారు.
విచిత్రకరమైన విషయం ఏంటంటే ఈ సిరీస్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ప్లేయర్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు ఇవ్వలేదు. కనీసం మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరో కూడా చెప్పలేదు. రెండు మ్యాచుల్లో అటు బ్యాటుతో, ఇటు బంతితో రాణించిన రవిచంద్రన్ అశ్విన్ కు ఈ అవార్డు దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ విండీస్ క్రికెట్ బోర్డు మాత్రం ఈ అవార్డునే ప్రకటించలేదు.
దీనిపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లేని సిరీస్ ఇదేనని, కనీసం ఓ జ్ఞాపికను అందజేసినా సరిపోయేదని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే మిక్సీ ఇచ్చినా సరిపోయేదని సెటైర్లు పేల్చుతున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఇచ్చినట్లు సిరీస్కు కూడా ఓ 500 డాలర్లు ఇస్తే సరిపోయేది కదా? అని ప్రశ్నిస్తున్నారు.
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తమ ఆటగాళ్లకు జీతాలను కూడా చెల్లించలేకపోతుంది.ఈ క్రమంలోనే స్టార్ ఆటగాళ్లు తమ దేశం కంటే విదేశీ లీగ్స్ ఆడటంపైనే ఆసక్తి చూపుతున్నారు. దాంతో ఎంతో చరిత్ర కలిగిన విండీస్.. వన్డే ప్రపంచకప్కు కూడా అర్హత సాధించలేకపోయింది.