
అహ్మదాబాద్: వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ భారత్కు 1000వ వన్డే కాగా.. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ పిచ్ దృష్ట్యా చేజింగ్కు మొగ్గు చూపాడు. లైట్స్ కింద బ్యాటింగ్ చేయడం ఉత్తమమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. గాయం నుంచి కోలుకొని రీఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని, దేశం తరఫున ఆడటానికి తన తొలి ప్రాధాన్యత ఉంటుందని హిట్ మ్యాన్ తెలిపాడు.
గత రెండు మూడు నెలలుగా తాను క్రికెట్ ఆడలేదని, అయితే క్రికెట్లో ఇది సర్వసాధారణమని చెప్పాడు. తమకు ఇది 1000 వన్డే మ్యాచ్ అని, ఈ ప్రయాణంలో భారత జట్టు ఎన్నో ఒడిదొడుకులను చూసిందన్నాడు. జట్టులో కీలక ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో కొత్త ఆటగాళ్లు జట్టులోకి వచ్చారని చెప్పాడు. దీపక్ హుడా ఈ మ్యాచ్తో అరంగేట్రం చేస్తున్నాడని తెలిపాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ అవకాశం దక్కించుకోగా.. స్పిన్నర్లుగా వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్కు చోటు దక్కింది. పేసర్లుగా శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగుతున్నారు. ఇక సౌతాఫ్రికా పర్యటనలో అద్భుత ప్రదర్శన కనబర్చిన దీపక్ చాహర్కు మళ్లీ నిరాశే ఎదురైంది.
మ్యాచ్ ఫలితంపై టాస్ ప్రభావం 50-50 ఉంటుందని, పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేస్తే ఆశించిన ఫలితం రాబట్టవచ్చని వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ అన్నాడు. తమ ఆటగాళ్లు సవాళ్లను త్వరగా అందిపుచ్చుకుంటారని తెలిపాడు. కొన్ని రోజుల ముందే సిరీస్ ఆడి వస్తున్నామని, మానసికంగా కొంత అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. ఎక్కువ సేపు బ్యాటింగ్ చేస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తే భారీ స్కోర్ సాధించవచ్చన్నాడు. జట్టులో కొన్ని మార్పులు చేశామని, రోచ్, అలెన్, డారెన్ బ్రావో జట్టులోకి వచ్చారని చెప్పాడు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, షై హోప్(కీపర్), శమరా బ్రూక్స్, డారెన్ బ్రావో, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), జాసన్ హోల్డర్, ఫాబియన్ అలెన్, అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్, అకీల్ హుస్సేన్