ఆసియా కప్ 2025 టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియా నాలుగు రోజుల వ్యవధిలోనే వెస్టిండీస్తో రెండు టెస్ట్ల సిరీస్కు సిద్దమైంది. గురువారం(అక్టోబర్ 2) నుంచి అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో ప్రారంభమయ్యే తొలి టెస్ట్లో బరిలోకి దిగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ చేరిన భారత జట్టు ప్రాక్టీస్ కూడా ప్రారంభించింది. ఈ ఇంటెన్స్ ప్రాక్టీస్ సెషన్కు టీమిండియా స్టార్ ఆటగాళ్లు అయిన జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ దూరంగా ఉన్నారు.
ఆసియా కప్ 2025 ఫైనల్ ఆడిన ఈ ముగ్గురు ఆటగాళ్లు.. అలసటను తొలగించుకునేందుకు ఈ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనలేదని తెలుస్తోంది. కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు ఇతర ఆటగాళ్లంతా ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ ప్రాక్టీస్ సెషన్ను పర్యవేక్షించాడు. మూడు గంటల పాటు సాగిన ఈ ప్రాక్టీస్ సెషన్ లైట్ వార్మప్తో మొదలైంది.

ఆ తర్వాత ఫీల్డింగ్ ప్రాక్టీస్తో పాటు నెట్స్లో ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ సాధన చేశారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ నెట్స్లో స్పిన్నర్లతో పాటు ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొన్నారు. మిడిలార్డర్ బ్యాటర్లు సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ భారీ షాట్లు సాధన చేశారు. గిల్.. పేస్ బౌలింగ్ను ఎదుర్కొన్నాడు.
మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ సుదీర్ఘ స్పెల్స్ బౌలింగ్ చేశారు. ఈ ఇద్దరూ ఆటగాళ్లు భారత్-ఏ తరఫున.. ఆస్ట్రేలియా-ఏతో టెస్ట్ సిరీస్ ఆడారు. బౌలింగ్ రిథమ్ను అందుకునేందుకు శ్రమించారు. గంభీర్.. ఈ మ్యాచ్కు సంబంధించిన పిచ్ను పలుమార్లు పరిశీలించాడు. పిచ్ కండిషన్స్కు తగ్గట్లు టీమ్ కాంబినేషన్ను ఎంపిక చేయడంపై గంభీర్ ఫోకస్ పెట్టాడు.
ఆస్ట్రేలియా-ఏతో శతకం సాధించిన దేవదత్ పడిక్కల్ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. నితీష్ కుమార్ రెడ్డితో జట్టుకు బ్యాటింగ్తో పాటు అదనపు పేస్ ఆప్షన్ లభించనుంది. మరోవైపు వెస్టిండీస్ జట్టు వర్షం కారణంగా ఇండోర్ నెట్స్కే పరిమితమైంది. అరగంట మాత్రమే సాధన చేసింది. ఈ మ్యాచ్ పిచ్ కండిషన్స్ స్పిన్కు అనుకూలంగా ఉండనున్నాయి. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్తో పాటు జడేజా కీలకం కానున్నాడు.