పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో వెస్టిండీస్ పోరాడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 108 ఓవర్లలో 5 వికెట్లకు 229 పరుగులు చేసింది. జాసన్ హోల్డర్ (11 బ్యాటింగ్), అథనేజ్ (37 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వెస్టిండీస్ ఇంకా 209 పరుగుల వెనుకంజలో ఉంది.
కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్ (75) హాఫ్ సెంచరీతో రాణించగా.. కిర్క్ మెకంజీ (32), బ్లాక్వుడ్ (20), జాషువా ద సిల్వా (10) మరోసారి విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, అశ్విన్, ముఖేశ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. మ్యాచ్కు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో 67 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

86/1తో మూడోరోజు ఆటను కొనసాగించిన వెస్టిండీస్.. తొలి సెషన్లో నిలకడగా ఆడింది. ఆత్మవిశ్వాసంతో కనిపించిన మెకంజీ చక్కటి షాట్లు ఆడాడు. అయితే జోరు మీదున్న అతన్ని టీమిండియా అరంగేట్ర పేసర్ ముకేశ్ కుమార్ పెవిలియన్కు పంపాడు. అతను ఔటైన వెంటనే వర్షం రావడంతో ఆట ఆగిపోయింది.
వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో కొద్దిసేపు వేచిచూసిన అంపైర్లు 20 నిమిషాలు ముందుగానే లంచ్ బ్రేక్ ప్రకటించారు. వర్షం కారణంగా తొలి సెషన్లో 10.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
సెకండ్ సెషన్లో బ్లాక్వుడ్ సహకారంతో బ్రాత్వైట్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. 37 పరుగుల వ్యక్తిగత స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్కు వచ్చిన అతను.. లంచ్ తర్వాత 170 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ చేసేలా కనిపించిన అతన్ని అశ్విన్ అద్భుతమైన డెలివరీతో క్లీన్బౌల్డ్ చేసి బ్రేక్ ఇచ్చాడు.
తర్వాత అథనేజ్తో కలిసి బ్లాక్వుడ్ మరో వికెట్ పడకుండా రెండో సెషన్ను ముగించాడు. దాంతో విండీస్ 174/3 టీ బ్రేక్కు వెళ్లింది. చివరి సెషన్ తొలి ఓవర్ లోనే బ్లాక్వుడ్ ఔటయ్యాడు. జడేజా బౌలింగ్లో స్లిప్లో రహానె ఒంటిచేత్తో సూపర్ క్యాచ్ అందుకోవడంతో బ్లాక్వుడ్ నాలుగో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు.
తర్వాత క్రీజులోకి వచ్చిన జాషువా ది సిల్వా (10)ను మహమ్మద్ సిరాజ్ క్లీన్బౌల్డ్ చేశాడు. ద సిల్వా ఔటవ్వగానే మళ్లీ వర్షం మొదలైంది. సుమారు 50 నిమిషాల తర్వాత ఆట ప్రారంభమైంది. అథనేజ్, హోల్డర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. నాలుగో రోజూ కూడా విండీస్ ఇదే పోరాట పటిమ కొనసాగిస్తే మ్యాచ్ ఆఖరి రోజు వరకు వెళ్లి డ్రా అయ్యే అవకాశం ఉంది.భారత్ తొలి ఇన్నింగ్స్లో 438 పరుగులు చేసిన విషయం తెలిసిందే.