న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వెస్టిండీస్ పర్యట నుంచి విశ్రాంతి కల్పించినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తోంది. రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లందరూ ఈ పర్యటనకు వెళ్లనున్నారని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమితో ప్రస్తుతం విరామం తీసుకుంటున్న టీమిండియా.. వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జూలై 12 నుంచి మొదలయ్యే ఈ సుదీర్ఘ పర్యటనలో టీమిండియా ఆతిథ్య వెస్టిండీస్తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.

ఈ సుదీర్ఘ పర్యటనకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజాలు దూరంగా ఉండనున్నారని వార్తలు వచ్చాయి. తీరిక లేని షెడ్యూల్తో అలిసిపోయిన ఈ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ నిర్ణయించిందని, వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుందని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
అయితే నెల రోజుల రెస్ట్ సరిపోతుందని, రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లంతా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్నారని ఓ బీసీసీఐ అధికారి ఇన్సైడ్ స్పోర్ట్స్ వెబ్సైట్కు తెలిపాడు. గాయాలతో జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్లు మాత్రం ఈ పర్యటనకు దూరంగా ఉండనున్నారని పేర్కొన్నాడు.
'వెస్టిండీస్ పర్యటనకు సంబంధించిన సెలెక్షన్కు రోహిత్ శర్మ అందుబాటులో ఉన్నాడు. అతను పూర్తి ఫిట్గా ఉన్నాడు. అతనికి కావాల్సిన విశ్రాంతి లభించింది. కాబట్టి వర్క్లోడ్ మేనేజ్మెంట్ను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వెస్టిండీస్ పర్యటనలో అతనే జట్టును నడిపించనున్నాడు.
ఐపీఎల్తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్లో రోహిత్ విఫలమవ్వడం వాస్తవమే. కానీ గత కొన్ని నెలలుగా అతను అద్భుత ప్రదర్శన కనబర్చాడనే విషయం మరిచిపోవద్దు. ఆస్ట్రేలియాతో నాగ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో సెంచరీ చేశాడు. ఫిట్నెస్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా రోహిత్ను విమర్శించడం సరికాదు.'అని సదరు అధికారి అభిప్రాయపడ్డాడు.
ఈ వారం చివర్లో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్ల వివరాలను బీసీసీఐ వెల్లడించే అవకాశం ఉంది. వన్డే, టెస్ట్ సిరీస్లకు రోహిత్ శర్మ సారథ్యం వహించనుండగా.. టీ20 సిరీస్లో హార్దిక్ జట్టును నడిపించనున్నాడు. శుభ్మన్ గిల్ సైతం టీ20లకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.