హైదరాబాద్: 'తన కోపమే తన శత్రువు'అనే పెద్దల మాట టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుత పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. దేశవాళీ క్రికెట్లో టన్నుల కొద్ది పరుగులు చేస్తున్నా.. భారత సెలెక్టర్లు మాత్రం ఈ యువ బ్యాటర్ను పట్టించుకోవడం లేదు. తాజాగా వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన టెస్ట్ టీమ్లో కూడా సర్ఫరాజ్ఖాన్కు అవకాశం దక్కలేదు.
గత మూడు సీజన్లుగా దేశవాళీ క్రికెట్లో 100కు పైగా సగటుతో పరుగులు చేసినా.. సెలెక్టర్లు అతన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. వెస్టిండీస్ పర్యటనకు సర్ఫరాజ్ ఖాన్ను ఎంపిక చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు సెలెక్టర్లను ఘాటుగా విమర్శించారు.

ఐపీఎల్ ప్రదర్శనతో టెస్ట్ టీమ్ను ఎంపిక చేసినప్పుడు.. రంజీట్రోఫీని నిర్వహించడం ఎందుకని మండిపడ్డాడు. సర్ఫరాజ్ఖాన్ కూడా తనను ఎంపిక చేయకపోవడంపై సోషల్ మీడియా వేదికగా అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తన ప్రదర్శనలకు సంబంధించిన హైలైట్స్ను ఇన్స్టా స్టోరీలో పెట్టి ఒక్క మాట కూడా అనకుండానే సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చాడు.
సర్ఫరాజ్ ఇప్పటివరకు 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 79.65 సగటుతో 3,505 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలున్నాయి.
అయితే రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ సందర్భంగా ఢిల్లీతో మ్యాచ్లో సెంచరీ అనంతరం సర్ఫరాజ్ ఖాన్ అగ్రెసివ్గా సంబరాలు చేసుకోవడమే అతని కొంపముంచిందని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.
ఆ మ్యాచ్కు అప్పటి చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ హాజరయ్యాడని, అతను కూర్చున్న వైపు ఆగ్రహంగా చూసిన సర్ఫరాజ్ తన బ్యాట్ను చూపిస్తూ ఎటకారపు సైగలు చేశాడన్నాడు. ఆ ప్రవర్తనే సెలెక్టర్లు కోపం తెప్పించిందని పీటీఐకి తెలిపాడు. అతని ఫిటెనెస్ విషయంలోనూ సెలెక్టర్లు సంతృప్తిగా లేరని, మైదానంలో చురుకుగా కదలలేడని పక్కనపెట్టేసారని చెప్పాడు.
'సర్ఫరాజ్ ఖాన్ను భారత జట్టులోకి తీసుకోకపోవడానికి క్రికెటే కాకుండా ఇతర కారణాలున్నాయి. అతని దూకుడైన సంబరాలు సెలెక్టర్లకు కోపం తెప్పించాయి. చేతన్ శర్మ హాజరైన ఓ రంజీ మ్యాచ్లో సెంచరీ అనంతరం సర్ఫరాజ్ ఖాన్ అతని వైపు ఆగ్రహంగా సైగలు చేశాడు. ఇది సెలెక్టర్లకు నచ్చలేదు.
సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటికైనా అతిగా ప్రవర్తించడం మానేసి ఫిట్నెస్పై ఫోకస్ పెట్టాలి. అతను మైదానంలో చురుకుగా కదలలేడు. ఆఫ్ద ఫీల్డ్లోనూ అతని ప్రవర్తనపై ఫిర్యాదులున్నాయి. సెలెక్టర్ల పట్ల అలా సైగలు చేస్తూ సంబరాలు చేసుకోవడం పద్దతి కాదు. అతను కాస్త ఓపికగా ఉంటూ మర్యాదగా నడుచుకుంటే మంచిది.'అని సదరు బీసీసీఐ అధికారి చెప్పుకొచ్చాడు.