
న్యూఢిల్లీ: భారత్-వెస్టిండీస్ మధ్య అహ్మదాబాద్ వేదికగా జరగాల్సిన మూడు వన్డేల సిరీస్పై నీలినీడలు కమ్ముకున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6(ఆదివారం) నుంచి ఈ సిరీస్ ప్రారంభం కావాల్సి ఉండగా.. భారత జట్టులో కరోనా కలకలం రేగింది. బుధవారం రాత్రి నలుగురు ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది కరోనా బారిన పడగా.. గురువారం మరో కేసు నమోదైంది.
టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు గురువారం పాజిటీవ్ వచ్చింది. గాయం కారణంగా ఇటీవల ముగిసిన భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్కి దూరమైన అక్షర్ పటేల్.. భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్లో తప్పకుండా తుది జట్టులో ఉండేలా కనిపించాడు. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా జట్టులో లేకపోవడంతో.. అక్షర్ పటేల్కు అవకాశం దక్కింది. కానీ.. కరోనా కారణంగా అతను వన్డే సిరీస్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. అక్షర్ స్థానంలో ఎవరినీ భారత సెలెక్టర్లు ఇంకా టీ20 జట్టులోకి ఎంపిక చేయలేదు.
సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, రిజర్వ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, మిడిలార్డర్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్తో పాటు స్టాండ్ బై ప్లేయర్గా ఎంపికైన ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీకి బుధవారం రాత్రి కరోనా పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. అలానే జట్టులోని సపోర్ట్ స్టాఫ్లోనూ నలుగురు ఈ వైరస్ బారినపడినట్లు వార్తలు వస్తున్నాయి. అక్షర్ పటేల్తో కలిసి మొత్తం 9 మంది వైరస్ బారిన పడినట్లు తెలుస్తుంది.

కరోనా కలకలం నేపథ్యంలో ఫిబ్రవరి 6న జరగనున్న తొలి మ్యాచ్ రెండు మూడు రోజుల పాటు వాయిదా పడే అవకాశం ఉందని బీసీసీఐకి చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. కాగా, ఇప్పటికే ఇవాళ జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్ను కూడా రద్దు చేశారు. ఇద్దరు ఓపెనర్లు వైరస్ బారిన పడిన నేపథ్యంలో మయాంక్ అగర్వాల్ను కొత్తగా జట్టుతో చేర్చారు. "ప్రస్తుతానికి షెడ్యూల్ ప్రకారమే సిరీస్ జరుగుతుంది. జట్టులో మరిన్ని పాటిజివ్ కేసులు బయటపడితే రెండు మూడు రోజుల పాటు వాయిదా పడే అవకాశం ఉంది" అని సదరు ప్రతినిధి పేర్కొన్నారు.
రోహిత్ శర్మ ఇటీవలే గాయం నుంచి కోలుకోవడంతో తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్గా జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. దీంతో ఓపెనర్లుగా రోహిత్తో.. మయాంక్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. కాగా, ఈనెల 6, 9, 11 తేదీల్లో మూడు వన్డేలు జరగాల్సి ఉండగా 16, 18, 20 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనుంది.