వెస్టిండీస్తో రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 134.2 ఓవర్లలో 5 వికెట్లకు 518 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(258 బంతుల్లో 22 ఫోర్లతో 175), శుభ్మన్ గిల్(196 బంతుల్లో 2 సిక్స్లతో 16 ఫోర్లతో 129 నాటౌట్) శతకాలతో చెలరేగారు. నితీష్ కుమార్ రెడ్డి(54 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 43), ధ్రువ్ జురెల్(79 బంతుల్లో 5 ఫోర్లతో 44), కేఎల్ రాహుల్(54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 38) హాఫ్ సెంచరీలు చేజార్చుకున్నారు. వెస్టిండీస్ బౌలర్లలో జొమెల్ వారికన్(3/98) మూడు వికెట్లు తీయగా.. రోస్టన్ ఛేజ్ ఓ వికెట్ పడగొట్టాడు.
318/2 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే అనవసర పరుగుకు ప్రయత్నించి యశస్వి జైస్వాల్ రనౌట్గా వెనుదిరిగాడు. శుభ్మన్ గిల్తో సమన్వయ లోపం కారణంగా అతను డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. గిల్పై అసహనం వ్యక్తం చేస్తూ యశస్వి మైదానం వీడాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డితో కలిసి గిల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు.

తన ట్రేడ్ మార్క్ బ్యాటింగ్తో విండీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. లూజ్ బాల్స్ను బౌండరీకి తరలించిన గిల్.. మంచి బంతులను గౌరవించాడు. మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి వేగంగా ఆడాడు. వన్డే తరహాలో విండీస్ బౌలర్లపైకి ఎదురుదాడికి దిగాడు. రెండు భారీ సిక్సర్లు కూడా బాదాడు. ఈ క్రమంలో గిల్ 95 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో నితీష్ కుమార్ రెడ్డి దూకుడుగా ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగి హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. క్రీజులోకి ధ్రువ్ జురెల్ రాగా.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన గిల్ తొలి సెషన్ను ముగించాడు. దాంతో టీమిండియా 427/4 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
రెండో సెషన్లోనూ సాధికారికంగా బ్యాటింగ్ చేసిన గిల్.. 177 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ధ్రువ్ జురెల్ కూడా అతనికి అండగా నిలిచాడు. హఆఫ్ సెంచరీ ముంగిట రోస్టన్ ఛేజ్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో ఐదో వికెట్కు నమోదైన 102 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే ఇండియా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.