హైదరాబాద్: వెస్టిండీస్ పర్యటనలో వర్షం కారణంగా రెండు టెస్టుల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్న టీమిండియా మూడు వన్డేల సిరీస్కు సిద్దమైంది. గురువారం జరిగే తొలి వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఆసియా కప్ టోర్నీకి ముందు భారత్ ఆడే చివరి వన్డే సిరీస్ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ ఏడాది అక్టోబర్లో ప్రారంభమయ్యే వన్డే ప్రపంచ కప్కు ఈ సిరీస్ను టీమిండియా సన్నాహకంగా వాడుకోవాలనుకుంటోంది. టెస్టుల్లో తేలిపోయిన విండీస్.. వన్డే సిరీస్కు బలమైన జట్టును ఎంపిక చేసింది. స్టార్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే వన్డే పోరు రసవత్తరంగా సాగనుంది.

అయితే ఈ సిరీస్ను వీక్షించడం టీమిండియా అభిమానులకు సవాల్గా మారింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. మరుసటి రోజు వేకువజామున 3 గంటలకు మ్యాచ్ ముగియనుంది. నిద్రపోయే లేచే వరకు మ్యాచ్ ఫలితం రానుంది. ఈ క్రమంలోనే ఈ సిరీస్ను ఆస్వాదించడానికి అభిమానులకు అవకాశం లేదు.
ఈ కారణంతోనే ఈ సిరీస్ బ్రాడ్కాస్టింగ్ హక్కులకు ప్రధాన చానెల్స్ స్టార్ స్పోర్ట్స్, సోనీ దూరంగా ఉన్నాయి. ఓటీటీ వేదికగా జియో సినిమా ప్రత్యక్షంగా ప్రసారం చేస్తుండగా.. భారత ప్రభుత్వానికి చెందిన దూరదర్శన్ చానెల్ టీవీల్లో ప్రసారం చేస్తోంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ను ఈ రెండు వేదికలు భారత అభిమానులకు అందించాయి.
జియో సినిమా కేవలం హిందీ, ఇంగ్లీష్ కామెంట్రీ మాత్రమే అందిస్తుండగా.. దూరదర్శన్ బెంగాలి, తెలుగు, కన్నడ, తమిళ్, భోజ్పురి భాషల్లో వ్యాఖ్యానం అందించేందుకు సిద్దమైంది. డీడీ స్పోర్ట్స్ చానెల్లో హిందీ, ఇంగ్లీష్ కామెంట్రీ రానుండగా.. డీడీ సప్తగిరి, డీడీ యాదగిరి చానెల్స్లో తెలుగు కామెంట్రీ రానుంది.
గజ్జలో గాయంతో బాధపడుతున్న శార్దూల్ ఠాకూర్ తొలి వన్డేకు దూరం కానుండగా.. అక్షర్ పటేల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్, సూర్యకుమార్ యాదవ్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్/సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్/కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్/ముఖేశ్ కుమార్.
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్(కీపర్), హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేశ్ కుమార్.