టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ విషయంలో దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ చేసిన సూచనలను కెప్టెన్ రోహిత్ శర్మ పట్టించుకోలేదు. టీమ్ బెస్ట్ పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రాతో తొలి ఓవర్ వేయించకపోవడాన్ని ఈ దిగ్గజ ఆటగాళ్లు తప్పుబట్టారు. కెప్టెన్గా రోహిత్ శర్మ చేస్తున్న ఘోర తప్పిదమని విమర్శించారు.
పాకిస్థాన్తో విజయానంతరం రోహిత్ శర్మ తప్పిదాన్ని ప్రస్తావిస్తూ గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను లోయరార్డర్లో బ్యాటింగ్ చేయమంటే చేస్తారా? అని ప్రశ్నించాడు. అత్యుత్తమ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రాను తొలి ఓవర్లోనే బరిలోకి దించాలని అభిప్రాయపడ్డాడు.

ఘోర తప్పిదం..
'భారత క్రికెట్లో బౌలర్లు అత్యంత అరుదుగా గుర్తింపు పొందుతారు. చాలా రోజుల తర్వాత భారత బౌలర్లు మ్యాచ్ విన్నింగ్ క్రెడిట్ అందుకున్నారు. అయితే ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్ వేస్తాడని భావించా. కానీ అతనికి మూడో ఓవర్ ఇచ్చారు.
అత్యుత్తమ బౌలర్కు బంతిని ఇవ్వకుండా 12 బంతులను వృథా చేయడం ఎందుకు? టీమిండియా బెస్ట్ బ్యాటర్స్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను లోయరార్డర్లో బ్యాటింగ్ చేయమని చెప్పగలరా? వారు అత్యుత్తమ బ్యాటర్లు కాబట్టే ఓపెనర్లుగా ఆడుతున్నారు. అత్యుత్తమ పేసర్లు కూడా తొలి ఓవరే బౌలింగ్ చేయాలి.'అని గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇది టీ20 ఫార్మాట్..
కపిల్ దేవ్ సైతం రోహిత్ శర్మ కెప్టెన్సీని మందలించాడు. 'వికెట్లు తీసే సామర్థ్యం కలిగిన బౌలర్ బుమ్రా. అతన్ని ఐదు లేదా ఆరో ఓవర్లో బౌలింగ్కు దించితే మ్యాచ్ను చేజార్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇది టెస్టు మ్యాచ్ కాదు. టీ20 ఫార్మాట్. ఆదిలోనే వికెట్లు సాధిస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెరుగుతుంది.
కాబట్టి బుమ్రాతో రెండు ఓవర్లు స్పెల్ వేయించి వికెట్లు సాధిస్తే ప్రత్యర్థి జట్టు కష్టాల్లో పడుతుంది. అంతేగాక మన ఇతర బౌలర్లకు ఉపశమనంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు బుమ్రా బౌలింగ్లో పరుగులు రావొచ్చు. కానీ సానుకూల ధోరణీతో ముందుకు సాగాలి'' అని కపిల్ దేవ్ సూచించాడు.
పట్టించుకోని రోహిత్..
కపిల్ దేవ్, గవాస్కర్ సలహాలను రోహిత్ ఏ మాత్రం పట్టించుకోలేదు. అమెరికాతో మ్యాచ్లో నాలుగో ఓవర్లో బుమ్రాను బరిలోకి దించాడు. తొలి ఓవర్ను అర్ష్ దీప్ సింగ్తో వేయించాడు. తన ఫస్ట్ ఓవర్లోనే అర్ష్దీప్ సింగ్ రెండు వికెట్లు తీసాడు.