
పల్లెకెలె: శ్రీలంక పర్యటనలో భారత మహిళల జట్టు జోరు కొనసాగుతోంది. సోమవారం శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డేలోనూ హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్కు ముందే 2-1తో టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా వన్డే సిరీస్లోనూ అదే జోరు కొనసాగించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 173 పరుగులకు కుప్పకూలింది.
భారత బౌలర్లలో రేణుకా సింగ్(4/28) నాలుగు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. మేఘన సింగ్, దీప్తి శర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు. లంక బ్యాటర్లలో అమా కాంచన(47 నాటౌట్), నీలాక్షి డి సిల్వా(32) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత మహిళలు ఒక్క వికెట్ నష్టపోకుండా 25.4 ఓవర్లలో 174 పరుగులు చేసి భారీ విజయాన్నందుకున్నారు. ఓపెనర్లు స్మృతి మంధాన(83 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 94 నాటౌట్), షెఫాలీ వర్మ(71 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 71 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.
అయితే ఈ మ్యాచ్లో భారత వికెట్ కీపర్ యాస్తికా భాటియా చేసిన స్టంపౌట్ సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదుగా జరిగే ఈ ఘటనను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. భాటియా సూపర్ కీపింగ్ అంటూ కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఈ స్టంపౌట్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
అసలేం జరిగిందంటే.. శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా 23వ ఓవర్ను దీప్తి శర్మ వేయగా.. క్రీజులో బ్యాటర్ అనుష్క సంజీవని ఉంది. దీప్తి వేసిన లోయర్ ఫుల్టాస్ ఆమె డిఫెన్స్ చేసింది. దాంతో బంతి నెమ్మదిగా క్రీజును ధాటుతుండగా అప్రమత్తమైన యాస్తికా భాటియా మాములుగానే బంతిని అందుకొని వికెట్లకు కొట్టేసింది. ఏమాత్రం హడావిడి లేకుండా సైలెంట్గా తన పనిని చేసి అప్పీల్ చేసింది. దాంతో లంక బ్యాటర్ అవాక్కైంది. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరగా.. బ్యాటర్ క్రీజుకు మిల్లీమీటర్ దూరంలో ఉండిపోయినట్లు రివ్యూలో తేలింది.