
కొలంబో: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టాస్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సిరీస్లో వరుసగా రెండు సార్లు టాస్ ఓడిన టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ ఆఖరి మ్యాచ్లో మాత్రం గెలిచాడు. టాస్ గెలిచిన ఆనందంలో గబ్బర్ తొడ కొట్టి తన ట్రెడ్ మార్క్ సెలెబ్రేషన్ చేసకున్నాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. ధావన్ సెలెబ్రేషన్స్కు లంక కెప్టెన్ డసన్ షనకతో పాటు మ్యాచ్ రిఫరీ, కామెంటేటర్లు పగలబడి నవ్వారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను దూరదర్శన్ స్పోర్ట్స్ ట్వీట్ చేయగా నెట్టింట హల్చల్ చేస్తోంది. టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినంత సంబరపడుతుండు.. గబ్బర్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
టాస్ గెలిచిన గబ్బర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ను 2-0తో కైవసం చేసుకోవడంతో ఈ మ్యాచ్లో బెంచ్ బలగానికి అవకాశం ఇస్తున్నామని తెలిపాడు. దాంతో జట్టులో ఆరు మార్పులు చోటు చేసుకున్నాయని.. మొత్తం ఐదుగురు క్రికెటర్లు అరంగేట్రం చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. నవదీప్ సైనీతో పాటు అరంగేట్ర ఆటగాళ్లు సంజూ శాంసన్, నితీష్ రానా, కృష్ణప్ప గౌతమ్ చేతన్ సకారియా, రాహుల్ చాహర్ అవకాశం దక్కించుకున్నారు.
1980 మెల్బోర్న్ వన్డే తర్వాత మళ్లీ ఐదుగురు అరంగేట్రం చేయడం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియాతో జరిగిన నాటి మ్యాచ్లో దిలీప్ దోషీ, కీర్తీ ఆజాద్,రోజర్ బిన్నీ, సందీప్ పాటిల్, తిరమలాయ్ శ్రీనివాసన్లు అరంగేట్రం చేశారు. ఈ మ్యాచ్లో భారత్ భారీ విజయాన్నందుకుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కెప్టెన్ శిఖర్ ధావన్(13) నిరాశ పర్చగా.. మరో ఓపెనర్ పృథ్వీషా(49 బంతుల్లో 8 ఫోర్లతో 49) రాణించాడు. అరంగేట్ర ప్లేయర్ సంజూ శాంసన్(42 బ్యాటింగ్)తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. అయితే హాఫ్ సెంచరీ ముంగిట పృథ్వీషా దురదృష్టవశాత్తు ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూతీసుకున్నా ఫలితం లేకపోయింది. తన వన్డే కెరీర్లో ఇదే హయ్యెస్ట్ స్కోర్ కావడం విశేషం. షనక వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన షా.. వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులో మనీశ్ పాండే రాగా.. సంజూ శాంసన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నాడు.