IND vs SL వామప్ మ్యాచ్లో భారత్ ఘన విజయం.. హ్యాట్రిక్ సిక్స్లతో గెలిపించిన సిరాజ్!
శ్రీలంక పర్యటన భారత్ ఘనంగా ప్రారంభించింది. రెండు టెస్ట్ల సిరీస్కు సన్నాహకంగా శ్రీలంక ఎలెవన్తో జరిగిన మూడు రోజుల వామప్ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టెయిలెండర్ మహమ్మద్ సిరాజ్(15 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 32 నాటౌట్) అద్వితీయమైన బ్యాటింగ్తో చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది.
207 పరుగుల లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 45 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసి గెలుపొందింది. యశస్వి జైస్వాల్(46 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 61 రిటైర్డ్ హర్ట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. శుభ్మన్ గిల్(54 బంతుల్లో 7 ఫోర్లతో 44), మహమ్మద్ సిరాజ్(15 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 32 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో కేశర నువాంత(2/57) రెండు వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, రమేష్ మెండీస్ తలో వికెట్ తీసారు.

హ్యాట్రిక్ సిక్స్లతో గెలిపించిన సిరాజ్..
భారత్ విజయానికి ఆఖరి 6 బంతుల్లో 16 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో టెయిలెండర్ మహమ్మద్ సిరాజ్తో పాటు సరాన్ష్ జైన్ ఉండటంతో విజయం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ సిరాజ్ అనూహ్యంగా హ్యాట్రిక్ సిక్స్లు బాది విజయాన్ని అందించాడు. శ్రీలంక ఎలెవన్ ప్రధాన బౌలర్ కేశర నువాంత్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా మూడు బంతులను సిక్స్లు బాది భారత్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ విజయం భారత్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఈ మూడు రోజుల వామప్ మ్యాచ్ ద్వారా భారత ఆటగాళ్లకు కావాల్సిన ప్రాక్టీస్ లభించింది.
శతక్కొట్టిన పడిక్కల్
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఎలెవన్ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్లకు 363 పరుగులు చేసింది. నిషాన్ ఫెర్నాండో(65 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 66), రావిందు రసంతా(143 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 71), కెప్టెన్ సోనాల్ దినుషా(72 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(2/64), కుల్దీప్ యాదవ్(2/76), మానవ్ సుతార్(2/33) రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, యువ బౌలర్ సరాన్ష్ జైన్ ఒక్క వికెట్ తీయలేకపోయారు.
అనంతర భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 90 ఓవర్లలో 6 వికెట్లకు 357 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. దేవదత్ పడిక్కల్(164 బంతుల్లో 18 ఫోర్లతో 142 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా(117 బంతుల్లో 7 ఫోర్లతో 63) హాఫ్ సెంచరీతో రాణించాడు. మానవ్ సుతార్(90 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 41), సరాన్ష్ జైన్(22), గుర్నూర్ బ్రార్(17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 36 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.శ్రీలంక ఎలెవన్ బౌలర్లలో రమేష్ మెండీస్, అసంక మనోజ్ రెండేసి వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువాంత తలో వికెట్ తీసారు.
శ్రీలంక 200/6 డిక్లేర్డ్..
శ్రీలంక ఎలెవన్ రెండో ఇన్నింగ్స్లో 45 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. నిషాన్ ఫెర్నాండో(73 బంతుల్లో 10 ఫోర్లతో 63), నిపున్ ధనంజయ(56 బంతుల్లో 5 ఫోర్లతో 46), అంజల బండార(48 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 35) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ తీయగా.. గుర్నూర్ బ్రార్(2/37), రవీంద్ర జడేజా(2/33) రెండేసి వికెట్లు తీసారు. దాంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని భారత్ ముందు 207 పరుగుల లక్ష్యం నమోదైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


