
అదిరిపోయే ఆరంభం..
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(49 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 42), శుభ్మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఆరంభంలో కాస్త టైమ్ తీసుకున్నా.. ఆ తర్వాత బౌలర్లపై విరుచుకుపడ్డారు. కుమారా వేసిన 6వ ఓవర్లో రోహిత్ సిక్స్ బాదగా.. శుభ్మన్ గిల్ వరుసగా నాలుగు బౌండరీలు బాదాడు. ఆ తర్వాత ఓవర్కు ఓ బౌండరీ బాదిన ఈ జోడీ.. కసున్ రజితా వేసిన 10వ ఓవర్లో రెండు సిక్స్లు, ఫోర్తో 16 పరుగులు పిండుకుంది. దాంతో భారత్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీ కరుణరత్నే విడదీసాడు. రోహిత్ శర్మను లెంగ్త్ బాల్తో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

శుభ్మన్ సెంచరీ..
ఇక విరాట్ కోహ్లీ వచ్చి రావడంతోనే బౌండరీతో పరుగుల ఖాతాను తెరిచాడు. మరోవైపు శుభ్మన్ గిల్ 52 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ధాటిగా ఆడిన శుభ్మన్.. స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. బౌండరీలతో పాటు క్విక్ సింగిల్స్, డబుల్స్తో ఈ జోడీ స్మార్ట్గా బ్యాటింగ్ చేసింది. ఫెర్నాండో వేసిన 31వ ఓవర్లో బౌండరీ, సింగిల్తో విరాట్ 48 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా.. చివరి బంతికి సింగిల్ తీసి శుభ్మన్ 89 బంతుల్లో సెంచరీ సాధించాడు. శుభ్మన్కు కెరీర్లో రెండో సెంచరీ ఇది. ఆ తర్వాత దూకుడు కనబర్చిన శుభ్మన్ వరుస బౌండరీలు బాదాడు. అయితే రజితా సూపర్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేసి శుభ్మన్ ఇన్నింగ్స్కు తెరదించాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 131 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

శతక్కొట్టిన విరాట్ కోహ్లీ..
ఇక క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి విరాట్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఓవర్కు ఓ బౌండరీ బాదుతూ.. స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. కరుణరత్నే వేసిన 43వ ఓవర్లో విరాట్ కోహ్లీ కొట్టిన బౌండరీని ఆపే క్రమంలో శ్రీలంక ఫీల్డర్లు బండార, వాండర్సే ఒకరినొకరు ఘోరంగా ఢీకొట్టుకొని తీవ్రంగా గాయపడ్డారు. స్ట్రెచర్ల సాయంతో ఈ ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ బౌండరీతో 99కి చేరిన విరాట్ మరుసటి బంతికి సింగిల్ తీసి కెరీర్లో 46వ వన్డే సెంచరీ నమోదు చేశాడు. 85 బంతుల్లోనే 100 పరుగుల మార్క్ అందుకున్న విరాట్.. ఈ సిరీస్లో రెండో శతకాన్ని నమోదు చేశాడు.

సిక్సర్లతో..
అనంతరం మరింత జోరుగా ఆడిన విరాట్.. కరుణరత్నే బౌలింగ్లో రెండు సిక్స్లు, బౌండరీ బాదాడు. ధాటిగా ఆడే క్రమంలో శ్రేయస్ అయ్యర్(38) ఔటవ్వడంతో మూడో వికెట్కు నమోదైన 108 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(7), సూర్యకుమార్ యాదవ్(4) విఫలమైనా.. అక్షర్ పటేల్(2 నాటౌట్) సాయంతో విరాట్ జట్టుకు 390 పరుగుల భారీ స్కోర్ను అందించాడు.


Click it and Unblock the Notifications
