
మొహాలీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. కెరీర్లో 100వ టెస్ట్ ఆడుతున్న విరాట్ కోహ్లీకి టీమిండియా ఆటగాళ్లు గౌరవ వందనం చేశారు. శ్రీలంకతో మొహాలీ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్లో ఫీల్డింగ్కు దిగే సమయంలో భారత ఆటగాళ్లకు కోహ్లీకి ఘన స్వాగతం పలికారు. ఇరు వైపుల నిలబడి విరాట్ కోహ్లీని చప్పట్లతో స్వాగతించారు. ఇక భారత ఆటగాళ్ల చర్యతో తీవ్ర సంతోషానికి గురైన విరాట్ కోహ్లీ నవ్వుతూ వారి మధ్యలో నుంచి పరుగెత్తుకొచ్చాడు.
ఆ వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. ఈ వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ట్విటర్ వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇక విరాట్ కోహ్లీకి టీమిండియా ఆటగాళ్లు గౌరవ వందనం చేసే సమయంలో మైదానంలోని అభిమానులు కూడా అతనికి చప్పట్లతో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.
తన మైల్స్టోన్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ(45) సెంచరీ చేస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. నిలకడగా ఆడుతూ ఆశలు రేకెత్తించిన కోహ్లీ.. స్పిన్నర్ లసిత్ ఎంబుల్దేనియా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. సెంచరీ చేయకపోయినా.. జట్టుకు కావాల్సిన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఇక తొలి రోజు ఆటలో రిషభ్ పంత్(97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 96) ధనాధన్ ఇన్నింగ్స్తో తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. హనుమ విహారీ(58) హాఫ్ సెంచరీతో మెరిసాడు.
రెండో రోజు ఆటలో రవీంద్ర జడేజా(228 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్లతో 175 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా రవిచంద్రన్ అశ్విన్(82 బంతుల్లో 8 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్కు 130 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించగా.. మహమ్మద్ షమీ(20 నాటౌట్)తో కలిసి జడేజా 9వ వికెట్కు 103 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దాంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 574/8 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక అప్పుడే తొలి వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్లో ఓపెనర్ లాహిరి తిరమణ్నే(17) ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులో కెప్టెన్ దిముత్ కరుణరత్నే(27 బ్యాటింగ్)తో పాటు పాతుమ్ నిస్సంక(2 బ్యాటింగ్) ఉన్నారు.