
తిరువనంతపురం: శ్రీలంకతో మూడో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 166 నాటౌట్) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. అసాధారణ బ్యాటింగ్తో రికార్డుల మోత మోగించాడు. ఈ సెంచరీతో కెరీర్లో 46వ వన్డే పూర్తి చేసుకున్న కింగ్ కోహ్లీ.. సచిన్ 49 సెంచరీల రికార్డుకు మూడు అడుగుల దూరంలో నిలిచాడు. ఓవరాల్గా 74 సెంచరీ నమోదు చేసి సచిన్ 100 సెంచరీల రికార్డు అధిగమించే దిశగా దూసుకెళ్తున్నాడు. 259 ఇన్నింగ్స్ల్లోనే విరాట్ 46 సెంచరీలు బాదగా.. 452 ఇన్నింగ్స్ల్లో సచిన్ 49 శతకాలు నమోదు చేశాడు.
వన్డే క్రికెట్ చరిత్రలోనే నాలుగుసార్లు 150 ప్లస్ పరుగులతో అజేయంగా నిలిచిన ఏకైక ప్లేయర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ వన్డేల్లో ఐదు సార్లు 150+ స్కోర్లు నమోదు చేశాడు. గత నాలుగు వన్డే ఇన్నింగ్స్ల్లో విరాట్ మూడు సెంచరీలు బాదాడు. బంగ్లాదేశ్పై 113, శ్రీలంకపై 113, 4, 166 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే(12,650)ను విరాట్ కోహ్లీ అధిగమించాడు. కోహ్లీ ఇప్పటి వరకు 12754 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీకి అండగా శుభ్మన్ గిల్(97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్లతో 116) కూడా శతక్కొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(42), శ్రేయస్ అయ్యర్(38) పర్వాలేదనిపించారు. శ్రీలంక బౌలర్లలో కసున్ రజితా, లాహిరు కుమార రెండేసి వికెట్లు తీయగా.. కరుణరత్నే ఓ వికెట్ పడగొట్టాడు.