మూడు టీ20ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం అంతరాయం కలిగించడంతో టాస్కు గంట ఆలస్యమైంది. వర్ష ప్రభావం పరిస్థితుల నేపథ్యంలోనే బౌలింగ్ ఎంచుకున్నానని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. వర్ష ప్రభావ పరిస్థితులతో పాటు పిచ్ సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు అనుకూలంగా మారనుంది. తొలి మ్యాచ్లో గెలిచినా.. మేం కొన్ని విషయాల్లో మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. మెడనొప్పితో బాధపడుతున్న శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడు.

అతని స్థానంలో సంజూ శాంసన్ను తీసుకున్నాం. మిగతా జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు ముందుగా బ్యాటింగ్ చేయడం తమకు కలిసొచ్చే అంశమేనని శ్రీలంక సారథి చరిత్ అసలంక అన్నాడు. 'ముందుగా బ్యాటింగ్ చేయడం మంచిదే. తుది జట్టులో ఒక మార్పు చేశాం. దిల్షాన్ మదుషంక స్థానంలో రమేశ్ మెండీస్ను తీసుకున్నాం. తొలి మ్యాచ్లో మా టాప్-3 బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. బౌలర్ల కాస్త నిరాశపరిచారు. ఇది ఇప్పటికే ఉపయోగించిన పిచ్. కాబట్టి స్పిన్ కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నా.'అని చరిత్ అసలంక తెలిపాడు.
తుది జట్లు:
శ్రీలంక: పాతుమ్ నిస్సంక, కుశాల మెండీస్, కుశాల్ పెరీరా, కామిందు మెండీస్, చరిత్ అసలంక, డసన్ షనక, వానిందు హసరంగా, రమేశ్ మెండీస్, మహీశ్ తీక్షణ, మతీష పతీరణ, అషితా ఫెర్నాండో.
భారత్: యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్