టీమిండియా నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న వరల్డ్ రికార్డ్ను సమం చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధికసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ అందుకున్న ఆటగాడిగా కోహ్లీతో సమంగా నిలిచాడు. అయితే కోహ్లీ ఆడిన సగం మ్యాచ్ల్లోనే సూర్య ఈ ఫీట్ సాధించడం విశేషం.
125 మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ 16సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు అందుకుంటే.. 69 మ్యాచ్ల్లో సూర్య ఈ ఘనతను అందుకున్నాడు. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్తో పూర్తి స్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్.. ఫస్ట్ మ్యాచ్లోనే అసాధారణ ప్రదర్శన కనబర్చాడు.

విధ్వంసకర హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఇది సూర్యకు 16వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్.
టీ20ల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు అందుకున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ టాప్లో ఉండగా.. జింబాబ్వే బ్యాటర్ సికందర్ రాజా(91 మ్యాచ్ల్లో 15), మహమ్మద్ నబీ(129 మ్యాచ్ల్లో 14), రోహిత్ శర్మ(159 మ్యాచ్ల్లో 14) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. రిషభ్ పంత్(33 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 49), యశస్వి జైస్వాల్(21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 40), శుభ్మన్ గిల్(16 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 34) ధాటిగా ఆడారు.
శ్రీలంక బౌలర్లలో మతీష పతీరణ(4/40) నాలుగు వికెట్లు తీయగా.. దిల్షాన్ మదుషంక, అసిత ఫెర్నాండో, వానిందు హసరంగా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 170 పరుగులకు ఆలౌటై చిత్తుగా ఓడింది. పాతుమ్ నిస్సంక(48 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 79), కుశాల్ మెండీస్(27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 45) రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
14 ఓవర్లలో 140/1 స్కోర్ పటిష్టంగా కనిపించిన ఆ జట్టు తర్వాతి 32 బంతుల్లో 30 పరుగులే చేసి 9 వికెట్లు కోల్పోయి 170 పరుగులకు ఆలౌటై చిత్తుగా ఓడింది. భారత బౌలర్లలో రియాన్ పరాగ్(3/5) మూడు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్ తలో వికెట్ తీసారు.