
రాజ్కోట్: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ సునామీ ఇన్నింగ్స్తో శనివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో భారత్ 91 పరుగులతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 112 నాటౌట్) సెన్సేషనల్ సెంచరీకి అండగా శుభ్మన్ గిల్(46), రాహుల్ త్రిపాఠి(35), అక్షర్ పటేల్(21 నాటౌట్) రాణించారు. లంక బౌలర్లలో మదుషంక రెండు వికెట్లు తీయగా.. కసన్ రజిత, కరుణరత్నే, హసరంగా తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక.. 16.4 ఓవర్లలో 137 పరుగులకు కుప్పకూలింది. డసన్ షనక(23), కుశాల్ మెండిస్(23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. అక్షర్ పటేల్ వేసిన ఐదో ఓవర్లో కుశాల్ మెండీస్(23) క్యాచ్ ఔటవ్వగా.. అర్ష్దీప్ సింగ్ వేసిన మరుసటి ఓవర్లో పాతుమ్ నిస్సంక(15) పెవిలియన్ చేరాడు. దాంతో శ్రీలంక పవర్ ప్లేలో 2 వికెట్లకు 51 పరుగులు చేసింది. ఆ వెంటనే హార్దిక్ పాండ్యా.. అవిష్కా ఫెర్నాండో(1)ను పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో ధనంజయ డిసిల్వా,చరిత్ అసలంక బౌండరీలతో భారత బౌలర్లపైకి ఎదురుదాడి చేశారు.
అయితే చాహల్ తన వరుస ఓవర్లలో చరిత్ అసలంక(19), ధనంజయ డిసిల్వా(22)లను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత హసరంగా(9)ను పేస్తో బోల్తా కొట్టిన ఉమ్రాన్ మాలిక్.. మహీశ్ తీక్షణ(2)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కరుణరత్నే(0)ను హార్దిక్ పాండ్యా ఎల్బీగా ఔట్ చేయగా.. అర్ష్దీప్ సింగ్.. కసున్ రజితా(1) క్లీన్ బౌల్డ్ చేసిన భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.