ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా జోరు కొనసాగుతుంది. వరుసగా 6వ మ్యాచ్లోనూ టీమిండియా గెలుపొందింది. శ్రీలంకతో శుక్రవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో టీమిండియా సూపర్ ఓవర్లో గట్టెక్కింది. హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్ సంచలన బౌలింగ్తో ఓటమిని తప్పించుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 202 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 61), తిలక్ వర్మ(34 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 49 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగగా.. సంజూ శాంసన్(23 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 39), అక్షర్ పటేల్ (15 బంతుల్లో ఫోర్, సిక్స్తో 21 నాటౌట్) మెరుపులు మెరిపించారు. శ్రీలంక బౌలర్లలో మహీష తీక్షణ, దుష్మంత్ చమీర, వానిందు హసరంగ, డసన్ షనక, చరిత్ అసలంక చెరో వికెట్ తీసారు.

అనంతరం శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులే చేసింది. పాతుమ్ నిస్సంక(58 బంతుల్లో7 ఫోర్లు, 6 సిక్స్లతో 107 నాటౌట్) సెంచరీతో చెలరేగగా.. కుశాల్ పెరీరా(32 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 58) హాఫ్ సెంచరీతో రాణించాడు. డసన్ షనక(11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 22 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా తలో వికెట్ తీసారు.
ఆఖరి ఓవర్లో శ్రీలంక విజయానికి 12 పరుగులు అవసరం కాగా.. హర్షిత్ రాణా తొలి బంతికే సెంచరీ హీరో పాతుమ్ నిస్సంకను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. తర్వాతి మూడు బంతుల్లో 5 పరుగులు రాగా.. ఐదో బంతిని షనక బౌండరీ తరలించాడు. దాంతో ఆఖరి బంతికి శ్రీలంక విజయానికి మూడు పరుగులు అవసరం కాగా.. రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. దాంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాతుమ్ నిస్సంక వికెట్తో మ్యాచ్ మలుపు తిరిగింది.
సూపర్ ఓవర్లో అర్ష్దీప్ సింగ్ బౌలింగ్ చేయగా.. తొలి బంతికే కుశాల్ పెరీరా(0) ఔటయ్యాడు. తర్వాతి రెండు బంతులకు వైడ్ సాయంతో రెండు పరుగులే రాగా.. నాలుగో బంతికి డసన్ షనక సింగిల్ తీయబోయి రనౌట్ అయ్యాడు. అయితే రనౌట్ కంటే ముందే అంపైర్ క్యాచ్ ఔట్ ఇవ్వగా.. షనక రివ్యూ తీసుకున్నాడు. కానీ బంతి బ్యాట్కు తగలకపోవడంతో నాటౌట్గా తేలింది. అంపైర్ నిర్ణయం తర్వాత బంతి డెడ్ అవుతుంది. కాబట్టి రనౌట్ లెక్కలోకి రాదు. దాంతో షనక ఔటవ్వకుండా బచాయించాడు.
ఈ నిర్ణయం అభిమానులతో పాటు భారత ఆటగాళ్లను అయోమయానికి గురి చేసింది. కానీ అంపైర్లు ఆటగాళ్లకు వివరించి చెప్పారు. కానీ మరుసటి బంతికే షనక క్యాచ్ ఔటయ్యాడు. దాంతో భారత్ లక్ష్యం మూడు పరుగులుగా నమోదైంది. అనంతరం భారత్ ఒక్క బంతికే మూడు పరుగులు చేసి గెలుపొందింది.ఏకపక్ష మ్యాచ్లతో చప్పగా సాగిన ఆసియా కప్ 2025 టోర్నీలో ఈ మ్యాచ్ అసలు సిసలు మజా అందించింది. చరిత్రలో నిలిచిపోయింది.