
తిరవనంతపురం: భారత్తో మూడో వన్డేలో శ్రీలంక ఆటగాళ్లు జాఫ్రా వాండర్సే, అషేన్ బండార తీవ్రంగా గాయపడ్డారు. బౌండరీ ఆపే క్రమంలో ఈ ఇద్దరూ ఒకరినొకరు బలంగా ఢీకొట్టారు. ఈ ఊహించని ఘటనతో ఆట కొద్ది సేపు ఆగిపోగా.. శ్రీలంక ఆటగాళ్లు నొప్పితో విలవిలలాడుతూ గ్రౌండ్లోనే పడుకున్నారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో శ్రీలంక ఫిజియోలకు సాయం భారత ఫిజియోలు కూడా శ్రీలంక ఆటగాళ్లకు సాయం చేశారు. బౌండరీ ఆపే క్రమంలో బండారా మొకాలు వాండర్సే పొత్తి కడుపులో బలంగా తాకడంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బండారా లేచినా నొప్పితో ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఇక వాలంటీర్స్ స్ట్రెచర్ సాయంతో వాండర్సేను మైదానం బయటకు తీసుకెళ్లి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
కరుణరత్నే వేసిన 43వ ఓవర్లో ఈ దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని విరాట్ కోహ్లీ షాట్ ఆడగా.. డీప్ స్క్వేర్ ఫీల్డర్.. డీప్ మిడ్ వికెట్ ఫీల్డర్ బంతిని ఆపే ప్రయత్నం ఒకరినొకరు బలంగా ఢీకొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ కాగా.. ఇద్దరు ఆటగాళ్లు క్షేమంగా ఉండాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఇక క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ కూడా డసన్ షనకతో మాట్లాడుతూ ఆటగాళ్ల గాయాల తీవ్రతపై ఆరా తీసాడు. ఈ బౌండరీతో 99 పరుగులకు చేరుకున్న విరాట్.. మరుసటి బంతిని సింగిల్ తీసి వన్డేల్లో 46వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్లో విరాట్కు ఇది రెండో శతకం కావడం విశేషం. సెంచరీ అనంతరం విరాట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ధాటిగా ఆడే క్రమంలో శ్రేయస్ అయ్యర్(38) ఔటవ్వడంతో మూడో వికెట్కు నమోదైన 108 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(7), సూర్యకుమార్ యాదవ్(4) విఫలమైనా.. అక్షర్ పటేల్(2 నాటౌట్) సాయంతో విరాట్ జట్టుకు 390 పరుగుల భారీ స్కోర్ను అందించాడు.
అంతకుముందు శుభ్మన్ గిల్( 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 116) సెంచరీతో చెలరేగగా.. రోహిత్ శర్మ(49 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 42) మెరుపులు మెరిపించాడు.