IND vs SL: బెడిసికొట్టిన గబ్బర్ సేన ప్రయోగాలు.. మూడో వన్డే శ్రీలంకదే!

కొలంబో: శ్రీలంక పర్యటనలో భారత జైత్రయాత్రకు బ్రేక్ పడింది. శుక్రవారం జరిగిన ఆఖరి వన్డేలో ఆల్రౌండ్షోతో అదరగొట్టిన శ్రీలంక 4 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఫలితంగా 9 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై భారత్ను ఓడించింది. సిరీస్ గెలిచామనే ఉత్సాహంలో గబ్బర్ సేన చేసిన ప్రయోగాలు బెడిసి కొట్టాయి. పేలవ బ్యాటింగ్తో మూల్యం చెల్లించుకుంది. వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ను 47 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన గబ్బర్ సేన 43.1 ఓవర్లలో 225 పరుగులకు కుప్పకూలింది. పృథ్వీ షా(49 బంతుల్లో 8 ఫోర్లు 49), సంజూ శాంసన్(46 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 46), సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 7 ఫోర్లతో 40) మినహా అంతా విఫలమయ్యారు.
శ్రీలంక బౌలర్లలో అకిలా ధనుంజయ(3/44), ప్రవీణ్ జయవిక్రమార్క(3/59) భారత్ పతనాన్ని శాసించారు. చమీరా రెండు వికెట్లు తీయగా.. కరుణరత్నే, డసన్ షనక చెరొక వికెట్ పడగొట్టారు. అనంతరం డక్ వర్త లూయిస్ ప్రకారం 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 39 ఓవర్లలో 7 వికెట్లకు 227 రన్స్ చేసింది. అవిష్కా ఫెర్నాండో(98 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 76),భానుక రాజపక్సా(56 బంతుల్లో 12 ఫోర్లతో 65) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రాహుల్ చాహర్(3/54) మూడు వికెట్లు తీయగా.. చేతన్ సకారియా (2/34) రెండు, కృష్ణప్ప గౌతమ్, హార్దిక్ పాండ్యా చెరొక వికెట్ తీశారు.

రాణించిన ఫెర్నాండో..
227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ మినోద్ భానుక(7)ను కృష్ణప్ప గౌతమ్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. కానీ క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్సతో మరో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరి ఆచితూచి ఆడుతూ వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించడంతో పవర్ ప్లే ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టానికి 55 రన్స్ చేసింది. ఆ తర్వాత మరింత నిలకడగా ఆడిన ఈ జోడీ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగింది. ఈ క్రమంలో తొలుత ఫెర్నాండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆ తర్వాత రాజపక్స కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ అందుకున్నాడు.

ఆడుతూ పాడుతూ..
క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీనీ అరంగేట్ర పేసర్ చేతన్ సకారియా వీడదీసాడు. భానుక రాజపక్సను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధనుంజయ డిసిల్వాను సైతం సకారియా రిటర్న్ క్యాచ్తో వెనక్కి పంపాడు. క్రీజులోకి చరిత అసలంకా మెరుపులు మెరిపించాడు. అయితే హార్దిక్ పాండ్యా ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. అయితే లక్ష్యం తక్కువగా ఉండటంతో లంక ఆటగాళ్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశారు.

రాహుల్ చాహర్ చెలరేగినా..?
చివర్లో రాహుల్ చాహర్ డసన్ షనక(0), అవిష్కా ఫెర్నాండో, చమిక కరుణరత్నే(1)లను ఔట్ చేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కానీ చేయాల్సిన పరుగులు తక్కువగా ఉండటంతో శ్రీలంక సునాయస విజయాన్నందుకుంది. చివర్లో రమేశ్ మెండీస్(15 నాటౌట్), అకిలా ధనుంజయ(5 నాటౌట్) మరో తప్పిదం చేయకుండా లాంచనాన్ని పూర్తి చేశారు. మూడు టీ20ల సిరీస్ ముందు ఈ విజయంతో శ్రీలంక జట్టు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఆదివారం ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications