
అహ్మదాబాద్: భారత్తో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన రెండో వన్డేలో అనూహ్యంగా ఓటమిపాలైన శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్కు కారణమైన శ్రీలంక జట్టుపై మ్యాచ్ రిఫరీ రంజన్ ముదగల్లే చర్యలు తీసుకున్నాడు. శ్రీలంక ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తూ జరిమానా విధించాడు. ఈ మ్యాచ్లో శ్రీలంక టీమ్ నిర్దిష్ట సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసింది. ఈ తప్పిదాన్ని శ్రీలంక కెప్టెన్ డసన్ షనక అంగీకరించడంతో పాటు పశ్చాతాపం వ్యక్తం చేయడంతో ఎలాంటి తదుపరి విచారణ లేకుండా మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు.
ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్థిష్ట సమయానికన్నా తక్కువగా ఓవర్లు వేస్తే ఒక్కో ఓవర్ చొప్పున ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. ఇక ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ నిబంధనల ప్రకారం నిర్థిష్ట సమయానికన్నా తక్కువగా ఓవర్లు వేస్తే ఒక్కో ఓవర్ చొప్పున ఒక్కో పాయింట్ కోత విధిస్తారు. ఈ లెక్కన ఒక్క ఓవర్ తక్కువగా వేసిన శ్రీలంక ఓ పాయింట్ను కోల్పోయింది.
ఈ మ్యాచ్లో టీమిండియా టేలండర్ దీపక్ చహర్ అద్భుతం చేశాడు. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్లో ఒంటిచేత్తో టీమిండియాకు పరాభావాన్ని తప్పించాడు. స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ విఫలమైన చోట నేనున్నానంటూ భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. చాహర్ సూపర్ ఇన్నింగ్స్తో భారత్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. అసలంక (65; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నే (33 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) మరోసారి ధాటిగా ఆడాడు.
భారత బౌలర్లలో చహల్ (3/50), భువనేశ్వర్ (3/54), దీపక్ చహర్ (2/53) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఛేదనలో భారత్ 49.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసి నెగ్గింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. చివరిదైన మూడో వన్డే శుక్రవారం జరుగుతుంది.