
కొలంబో: శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టుతో తలపడబోయే శ్రీలంక జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. జూలై 18(ఆదివారం) నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం 25 మంది సభ్యులతో కూడి జంబో జట్టును ఎంపిక చేసింది. ఇందులో గాయం కారణంగా కెప్టెన్ కుశాల్ పెరీరా, బినురా ఫెర్నాండో ఈ సిరీస్లకు దూరమయ్యారు. దాంతో డసన్ షనకను తమ నూతన కెప్టెన్గా శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. గత నాలుగేళ్లలో శ్రీలంకకు షనక ఆరో కెప్టెన్. 2018 నుంచి దినేశ్ చండీమల్, ఎంజేలో మాథ్యూస్, లసిత్ మలింగా, దిముత్ కరుణరత్నే, కుశాల్ పెరీరా కెప్టెన్లుగా వ్యవహరించారు.
2019లో తొలిసారి శ్రీలంక కెప్టెన్గా వ్యవహరించిన షనక.. పాకిస్థాన్పై టీ20 సిరీస్ విజయాన్నందించాడు. వెస్టిండీస్ పర్యటనకు కూడా ఎంపికైనప్పటికీ వీసా సమస్య కారణంగా పాల్గొనలేకపోయాడు. భారత్తో సిరీస్ల్లో ధనుంజయ డిసిల్వా వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఇంగ్లండ్ చేతిలో టీ20, వన్డే సిరీస్ల్లో చిత్తుగా ఓడిన శ్రీలంక టీమ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. పైగా ఆ జట్టు తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది.
ఇంగ్లండ్ పర్యటనలో స్టార్ ప్లేయర్లు కుశాల్ మెండీస్, వికెట్ కీపర్ నిరోషన్ డిక్ వెల్లా, ధనుష్క గుణతిలక బయో బబుల్ నిబంధనలను అధిగమించి నిషేధానికి గురయ్యారు. ప్రస్తుతం వారిపై విచారణ జరుగుతుంది. అంతేకాకుండా ఆటగాళ్ల కాంట్రాక్టుల విషయంలోనూ వివాదం నెలకొంది. చివరకు 29 మంది ఆటగాళ్లు కాంట్రాక్టులపై సంతకాలు చేసినప్పటికీ సీనియర్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ వ్యక్తిగత కారణాలతో భారత్తో సిరీస్లకు దూరమయ్యాడు.
శ్రీలంక జట్టు:
డసన్ షనక(కెప్టెన్), ధనుంజయ డిసిల్వా(వైస్ కెప్టెన్), అవిష్కా ఫెర్నాండో, భనుక రాజపక్స, పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, వానిందు హరసరంగ, యాషెన్ బండార, మినొద్ భానుక, లాహిరు ఉడారా, రామేశ్ మెండీస్, చామిక కరుణరత్నే, దుష్మంత చమీరా, లక్షణ్ సందకన్, అకిలా ధనుంజయ, షిరన్ ఫెర్నాండో, ధనుంజయ లక్షణ్, ఇషాన్ జయరత్నే, ప్రవీణ్ జయవిక్రెమా, అసితా ఫెర్నాండో, కసున్ రజితా, లాహిరు కుమార, ఇసురు ఉడాన, కుశాల్ పెరీరా, బినురా ఫెర్నాండో(గాయంతో దూరం)