IND vs SL: టీమిండియా కొంపముంచిన భువనేశ్వర్.. శ్రీలంక సైలెంట్ విక్టరీ!

కొలంబో: శ్రీలంక గడ్డపై శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టుకు మరో షాక్ తగిలింది. బుధవారం జరిగిన రెండో టీ20లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. ధనుంజయ డిసిల్వా(34 బంతుల్లో 40 నాటౌట్), చమిక కరుణరత్నే(12 నాటౌట్) కడవరకు నిలిచి శ్రీలంకకు చిరస్మరణీయ విజయాన్నందించారు. దాంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. డిసైడర్ మ్యాచ్ గురువారం రాత్రి జరగనుంది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 రన్స్ మాత్రమే చేసింది. శిఖర్ ధావన్(40), దేవదత్ పడిక్కల్(29), రుతురాజ్ గైక్వాడ్(21) పర్వాలేదనిపించగా మిగతా బ్యాట్స్మన్ విఫలమయ్యారు. లంకబౌలర్లలో అకిలా ధనుంజయ రెండు వికెట్లు తీయగా.. చమీరా, హసరంగా, షనక తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం శ్రీలంక 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 133 పరుగులు చేసి థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ధనుంజయ డిసిల్వాకు తోడుగా మినోద్ భానుక(36) రాణించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, చేతన్ సకారియా, వరుణ్ చక్రవర్తీ, రాహుల్ చాహర్ తలో వికెట్ తీయగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసాడు. ఓ దశలో భారత్ విజయం ఖాయమనిపించగా.. ధనుంజయ కడవరకు నిలిచి సైలెంట్గా మ్యాచ్ను ఫినిష్ చేశాడు.

చెలరేగిన స్పిన్నర్లు..
133 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. భువీ బౌలింగ్లో యువ ప్లేయర్ రాహుల్ చాహర్ అసాధారణ ఫీల్డింగ్కు శ్రీలంక డేంజరస్ ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో(11) నిరాశగా పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ మినోద్ భానుక(36) ఆడపా దడపా బౌండరీలు బాదడంతో లంక పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 36 రన్స్ చేసింది. అయితే ఆ వెంటనే ధావన్ స్పిన్నర్లకు రంగంలోకి దించగా.. సమరవిక్రమా(8), కెప్టెన్ డసన్ షనక(3)ల వికెట్లను కోల్పోయింది. వరుణ్ చక్రవర్తీ బౌలింగ్లో సమర విక్రమా బౌల్డ్ అవ్వగా.. కెప్టెన్ డసన్ షనక కుల్దీప్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. అతని మరుసటి ఓవర్లో మినోద్ బానుక ఇచ్చిన క్యాచ్ను భువీ నేలపాలు చేశాడు. కానీ ఆ వెంటనే మరో భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు.

ధనుంజయ పోరాటం..
ఆ తర్వాత క్రీజులోకి వానిందు హసరంగ(15) రెండు బౌండరీలతో జోరు కనబర్చగా.. రాహుల్ చాహర్ పెవిలియన్ చేర్చాడు. అయితే వికెట్ తీసిన ఆనందంలో రాహుల్ సంబరాలు చేసుకుంటుండగా.. హసరంగా అభినందిస్తూ క్రీజును వీడాడు. భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో సకారియా బౌలింగ్లో రమేశ్ మెండీస్(2) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అయితే ఆ ఓవర్లో ధనుంజయ డిసిల్వా ఓ బౌండరీ బాదడంతో.. శ్రీలంక విజయానికి 12 బంతుల్లో 20 రన్స్ అవసరమయ్యాయి.

కొంపముంచిన భువీ..
అయితే ఈ క్రమంలో మైదానంలో చిరుజల్లులు కురిసాయి. కానీ ఆ వెంటనే తేరుకోవడంతో మ్యాచ్ కొనసాగింది. భువీ వేసిన 19వ ఓవర్లో కరుణరత్నే ఓ భారీ సిక్సర్ కొట్టడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత క్విక్ సింగిల్స్, డబుల్స్ తీయడంతో ఈ ఓవర్లో మొత్తం 12 పరుగులు రాగా.. లంక విజయానికి ఆఖరి ఓవర్లో 8 రన్స్ అవసరమయ్యాయి. చివరి ఓవర్లో ధనుంజయ, చమిక కరుణరత్నే వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తి 9 పరుగులు పిండుకోవడంతో రెండు బంతులు మిగిలుండగానే శ్రీలంక విజయాన్నందుకుంది. అయితే ఈ ఓవర్ రెండో బంతిని అంపైర్ వైడ్ ఇవ్వడం విస్మయపరిచింది. అంపైర్తో కెప్టెన్ ధావన్సైతం దీనిపై చర్చించాడు. ఆ రెండు పరుగులతో పూర్తిగా మ్యాచ్ శ్రీలంక వైపు మళ్లింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications