శ్రీలంక పర్యటనను టీమిండియా ఘోర పరాజయంతో ముగించింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన ఆఖరి మ్యాచ్లో టీమిండియా 110 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. చెత్త బ్యాటింగ్ టీమిండియా కొంపముంచింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంది. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత శ్రీలంక.. భారత్పై వన్డే సిరీస్ గెలిచింది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 248 పరుగులు చేసింది. అవిష్కా ఫెర్నాండో(102 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 96) తృటిలో శతకాన్ని చేజార్చుకోగా.. కుశాల్ మెండీస్(82 బంతుల్లో 4 ఫోర్లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ పాతుమ్ నిస్సంక(65 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

భారత బౌలర్లలో రియాన్ పరాగ్ మూడు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్లు తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 26.1 ఓవర్లలోనే 138 పరుగులకు కుప్పకూలింది. రోహిత్ శర్మ(20 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 35), వాషింగ్టన్ సుందర్(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాటర్లు విరాట్ కోహ్లీ(18 బంతుల్లో 4 ఫోర్లతో 20), శుభ్మన్ గిల్(6), రిషభ్ పంత్(6), శ్రేయస్ అయ్యర్(8), అక్షర్ పటేల్(2), రియాన్ పరాగ్(15), శివమ్ దూబే(9), కుల్దీప్ యాదవ్(6) దారుణంగా విఫలమయ్యారు.
శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లలేగే(5/27) ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. మహీష్ తీక్షణ్, జెఫ్రీ వాండర్సే రెండేసి వికెట్లు తీసారు. అసితా ఫెర్నాండోకు ఓ వికెట్ దక్కింది. శ్రీలంక పర్యటనతోనే టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన గంభీర్.. టీ20 సిరీస్ విజయంతో శుభారంభం అందుకున్నాడు. కానీ వన్డే సిరీస్లో అనూహ్య పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. ఈ సిరీస్లో భారత్.. బ్యాటింగ్, బౌలింగ్లో దారుణంగా విఫలమైంది.