టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కళ్లు చెదిరే ఫీల్డింగ్తో ఆకట్టుకున్నాడు. డైరెక్ట్ హిట్తో ప్రత్యర్థి బ్యాటర్ను రనౌట్ చేసి ఔరా అనిపించాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంకతో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ సెన్సేషనల్ ఫీల్డింగ్తో శ్రీలంక బ్యాటర్ కామిందు మెండిస్(40)ను పెవిలియన్ చేర్చాడు.
అయ్యర్ త్రోను ఏ మాత్రం ఊహించని మెండిస్.. ఈ రనౌట్ను చూసి బిత్తరపోయాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ రనౌట్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా... శ్రేయస్ అయ్యర్పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయ్యర్..సూపర్ ఫీల్డింగ్ అంటూ కొనియాడుతున్నారు.

శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా ఆఖరి ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ష్దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్ ఐదో బంతిని కామిందు మెండిస్.. డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడి క్విక్ డబుల్ తీసే ప్రయత్నం చేశాడు. సక్సెస్ ఫుల్గా సింగిల్ పూర్తి చేసిన మెండిస్.. రెండో పరుగు తీసే ప్రయత్నంలో రనౌటయ్యాడు.
డీప్ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ బంతిని అందుకొని బుల్లెట్ త్రోతో కీపర్ వైపు వికెట్లను డైరెక్ట్ హిట్ చేశాడు. దాదాపు 45 యార్డ్స్ దూరం నుంచి అతను కొట్టిన త్రో తో నేరుగా వికెట్లను తాకింది.
దాంతో కామిందు మెండీస్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ ఓవర్ ఆఖరి బంతికి ధనంజయ రనౌటయ్యాడు. విరాట్ కోహ్లీ చాకచక్యంగా వ్యవహరించి రనౌట్ చేశాడు. శ్రీలంక బ్యాటర్ వండర్సే మిడాఫ్ దిశగా ఆడి క్విక్ డబుల్ తీసే ప్రయత్నం చేశాడు. బంతిని అందుకున్న రోహిత్ బౌలర్ వైపు వికెట్లను కొట్టగా... మిస్సయ్యాయి. బ్యాకప్ ఫీల్డర్గా ఉన్న కోహ్లీ బంతిని అందుకొని బ్యాటర్ కంటే వేగంగా పరుగెత్తుకుంటూ కీపర్ వైపు స్టంప్స్ను కొట్టేశాడు. ఈ రనౌట్ను చూసి రోహిత్ శర్మ పడి పడి నవ్వుకున్నాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది. అవిష్కా ఫెర్నాండో(62 బంతుల్లో 5 ఫోర్లతో 40), కామిందు మెండీస్(44 బంతుల్లో 4 ఫోర్లతో 40) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(3/30) మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/33) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.