IND vs SL, World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా రికార్డు విజయాన్ని అందుకుంది. శ్రీలంకతో గురువారం జరిగిన మ్యాచ్లో సంచలన ప్రదర్శన కనబర్చిన టీమిండియా ఏకంగా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. మహమ్మద్ షమీ(5/18), మహమ్మద్ సిరాజ్(3/18) సంచలన ప్రదర్శనతో శ్రీలంక 55 పరుగులకే కుప్పకూలింది.
ప్రపంచకప్ చరిత్రలోనే టీమిండియాకు ఇది అతిపెద్ద విజయం. మెగా టోర్నీలో టీమిండియాకు ఇది వరుసగా ఏడో విజయం. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న టీమిండియా.. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అధికారికంగా సెమీస్ బెర్త్ను దక్కించుకుంది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 358 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్(92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లతో 92), విరాట్ కోహ్లీ(94 బంతుల్లో 11 ఫోర్లతో 88), శ్రేయస్ అయ్యర్(56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లతో 82) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. శ్రీలంక బౌలర్లలో మధుషంక(5/82) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. దుష్మంత్ చమీరాకు ఓ వికెట్ దక్కింది.
అనంతరం శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్కు తోడుగా జస్ప్రీత్ బుమ్రా(1/8), రవీంద్ర జడేజా(1/4) రాణించారు. శ్రీలంక బౌలర్లలో కాసున్ రజితా(14), మహీష్ తీక్షణ(12 నాటౌట్), ఏంజేలో మాథ్యూస్(12) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఐదుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. భారత పేసర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు 0, 0, 1, 0, 1, 12, 0, 0, 12 నాటౌట్, 14, 5 పరుగులు చేశారు.
ఈ ఓటమితో శ్రీలంక సెమీస్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన షమీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ చేరిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. ఈ భారీ విజయంతో టీమిండియా రన్రేట్ కూడా మెరుగైంది.