తమకంటే మెరుగైన ప్రదర్శన చేయడంతోనే శ్రీలంక విజయం సాధించిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయంతో తాము రిలాక్స్ అయ్యామనే వాదన సరికాదన్నాడు. ఇదో పెద్ద జోక్ అని, భారత్కు ఆడుతున్నప్పుడు రిలాక్స్ అనేది ఎప్పుడూ ఉండదని స్పష్టం చేశాడు.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన ఆఖరి మ్యాచ్లో టీమిండియా 110 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ గెలుపుతో శ్రీలంక మూడు వన్డేల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఫలితంగా 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్పై వన్డే సిరీస్ గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రోహిత్ శర్మ.. శ్రీలంక జట్టుపై ప్రశంసల జల్లు కురిపించాడు.

ఈ సిరీస్లో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయలేదని అంగీకరించిన రోహిత్ శర్మ.. ఈ ఓటమితో ప్రపంచం ఏం అంతం కాదని అసహనం వ్యక్తం చేశాడు. తమ జట్టులోని ఆటగాళ్లు ఎన్నో ఏళ్లుగా నిలకడగా రాణిస్తున్నారని, ఈ ఓటమితో బాధపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.
'స్పిన్ ఆడటంలో భారత్ బ్యాటర్లు తడబడటంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఈ వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత గేమ్ ప్లాన్స్పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సిరీస్లో మేం ఒత్తిడికి గురైన మాట వాస్తవం. టీ20 ప్రపంచకప్ విజయంతో మేం ఏం రిలాక్స్ అవ్వలేదు. ఇదో పెద్ద జోక్.
భారత్కు ఆడుతున్నంత కాలం రిలాక్స్ అవ్వడం అనేది ఉండదు. క్రెడిట్ ఇవ్వాల్సిన చోట ఇవ్వాల్సిందే. శ్రీలంక మా కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. కండిషన్స్కు తగ్గట్లు మేం కాంబినేషన్ను మార్చాము. ఈ సిరీస్లో మేం మెరుగైన ఆటతీరు కనబర్చలేదు. అందుకే ఓటమిపాలయ్యాం.
ఈ సిరీస్లో ఓడినా మాకు కొన్ని సానుకూలంశాలు ఉన్నాయి. స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కొందరు బ్యాటర్లు మిడిల్ ఓవర్లలో నిలబడి పోరాడారు. ఈ సిరీస్లో మేం ఓటమిపాలయ్యాం. కాబట్టి సానుకూలంశాల కంటే లోపాలపైనే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. స్పిన్ కండిషన్స్లో మేం ఎక్కడ తప్పిదాలు చేశామో చర్చించుకుంటాం. సిరీస్ ఓడిపోయినంత మాత్రానా ప్రపంచం ఏం అంతం కాదు. మా ఆటగాళ్లు ఎన్నోఏళ్లుగా నిలకడగా రాణిస్తున్నారు. కఠినమైన ఓ సిరీస్ను మేం ఓడిపోయాం. ఈ ఓటమి నుంచి ఎలా పుంజుకుంటామనేదే ముఖ్యం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.